'ఐపీఎల్‌లో ఆడడం కాదు.. అక్కడ ఆడితేనే గ్రేట్‌' | Sanjay Manjrekar warns Vaibhav Sooryavanshi: T20 fame wont earn Test cricket respect | Sakshi
Sakshi News home page

'ఐపీఎల్‌లో ఆడడం కాదు.. అక్కడ ఆడితేనే గ్రేట్‌'

May 5 2026 4:15 PM | Updated on May 5 2026 4:48 PM

Sanjay Manjrekar warns Vaibhav Sooryavanshi: T20 fame wont earn Test cricket respect

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో దూసుకుపోతున్న వైభ‌వ్ సూర్య‌వంశీపై భార‌త మాజీ క్రికెట‌ర్ సంజయ్ మంజ్రేక‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. వైభ‌వ్ అద్భుతంగా రాణిస్తున్న‌ప్ప‌టికి, టెక్నిక‌ల్‌గా మాత్రం ఇంకా చాలా మెరుగుప‌డాలి అని మంజ్రేక‌ర్ అన్నాడు. 

అంతేకాకుండా భార‌త‌ టీ20 జ‌ట్టులోకి వ‌చ్చేందుకు సూర్య‌వంశీకి అన్ని ర‌కాల అర్హ‌త‌లు ఉన్నాయ‌ని అత‌డు చెప్పుకొచ్చాడు. కాగా వైభవ్ సూర్య‌వంశీ సూప‌ర్ ఫామ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. జ‌స్ప్రీత్ బుమ్రా, హేజిల్‌వుడ్ వంటి వ‌ర‌ల్డ్‌క్లాస్ బౌల‌ర్ల‌ను సైతం ఈ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం విడిచిపెట్ట‌లేదు.

ఐపీఎల్ సీజన్‌కు ముందు జ‌రిగిన అండ‌ర్‌-19 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లోనూ వైభ‌వ్ దుమ్ములేపాడు. దీంతో సంజ‌య్ మంజ్రేక‌ర్ మాత్ర‌మే కాకుండా సునీల్ గ‌వాస్క‌ర్ వంటి దిగ్గ‌జాలు సైతం వైభ‌వ్‌ను భార‌త టీ20 జ‌ట్టుకు ఎంపిక చేయాల‌ని సూచిస్తున్నారు.

"వైభ‌వ్ సూర్య‌వంశీకి అద్భుతమైన టాలెంట్ ఉంది. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మ‌హారాష్ట్ర‌పై సెంచ‌రీ, ఐపీఎల్‌లో ఫామ్‌ను బ‌ట్టి చూస్తే భార‌త టీ20 జ‌ట్టులోకి వ‌చ్చేందుకు అతడు అర్హుడు. ఐపీఎల్ వంటి మ‌హా వేదిక‌పై  ఎవరైనా అద్భుతాలు సృష్టిస్తే, కచ్చితంగా జాతీయ జట్టు అరంగేట్రానికి సిద్దంగా ఉన్నట్లే.

ఇప్పుడు వైభవ్ కూడా సీనియర్ జట్టులోకి వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. కానీ ప్రస్తుత భారత టీ20 జట్టులో ఇప్పటికే ఓపెనింగ్ స్ధానం కోసం తీవ్రమైన పోటీ ఉంది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి ఓపెనర్లగా తమ సత్తాను నిరూపించుకున్నారు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ వంటి వారు కూడా ఓపెనర్లగా రాణిస్తున్నారు.

ఈ క్రమంలో వైభవ్‌ను ఓపెనర్‌గా ఆడిస్తే ఎవరిని జట్టు నుంచి తప్పిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. వైభవ్‌కు మంచి టాలెంట్ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ టెక్నికల్‌గా మాత్రం ఇంకా మెరుగుపడాలి. వైభవ్ ఎక్కువగా లెగ్ సైడ్ వైపు జరిగి ఆఫ్‌సైడ్‌లో షాట్లు కొడుతున్నాడు. 

ఇది కేవలం టీ20ల మాత్రమే సరిపోతుంది. టెస్టులకు సరిపోదు. ముఖ్యంగా  ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి పిచ్‌లపై రాణించాలంటే బంతికి దగ్గరగా వెళ్లి ఆడాలి. ఆఫ్ సైడ్ వైపు జరిగి ఆడితే పరుగులు సాధించలేరు. టీ20 క్రికెట్ ఆటగాళ్లకు డబ్బుతో పాటు మీకు మంచి పేరును తీసుకురావచ్చు. కానీ నిజమైన గౌరవం మాత్రం టెస్టు క్రికెట్‌లో రాణిస్తానే దక్కుతుందని" మంజ్రేక‌ర్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement