WPL 2023: ముంబై ఇండియన్స్‌ మహిళల టీమ్‌కు విషెస్‌ తెలిపిన రోహిత్‌ శర్మ

Rohit Sharma Wishes MI Women Team Before WPL Final - Sakshi

ముంబై ఇండియన్స్‌ మెన్స్‌ టీమ్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఇవాళ ఫైనల్‌ ఆడబోతున్న ముంబై ఇండియన్స్‌ వుమెన్స్‌ టీమ్‌కు ఓ ప్రత్యేక వీడియో ద్వారా విషెస్‌ తెలిపాడు. డబ్ల్యూపీఎల్‌ ఫైనల్లో భాగంగా ముంబై ఇండియన్స్‌ నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనున్న నేపథ్యంలో హిట్‌మ్యాన్‌తో పాటు ముంబై ఇండియన్స్‌ మెన్స్‌ టీమ్‌ సభ్యులందరూ హర్మన్‌ సేనకు శుభాకాంక్షలు తెలిపారు.

రోహిత్‌ మాట్లాడిన ప్రత్యేక వీడియోను ముంబై ఇండియన్స్‌ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఈ వీడియోలో రోహిత్‌ మాట్లాడుతూ.. గత నాలుగు వారాలుగా మీ ఆట తీరు అద్భుతంగా ఉండింది. వ్యక్తిగతంగా నేను మీ ఆటతీరును ఆస్వాదించాను. ఇవాళ జరుగబోయే ఫైనల్‌ చాలా కీలకం. ఆటను ఆస్వాదిస్తూనే ఎంజాయ్‌ చేయండి. నేటి ఫైనల్లో మీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చండి అంటూ ఎంఐ వుమెన్స్‌ టీమ్‌ను ఎంకరేజ్‌ చేశాడు.  

కాగా, బ్రబోర్న్‌ స్టేడియం​ వేదికగా ఇవాళ రాత్రి 7:30 గంటలకు డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. టేబుల్‌ టాపర్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నేరుగా ఫైనల్‌కు చేరుకోగా.. ముంబై ఇండియన్స్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో యూపీ వారియర్జ్‌ను ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ జెయింట్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరకుండానే నిష్క్రమించాయి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top