ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఉత్కంఠపోరులో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ 45 బంతుల్లో 65 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా.. తిలక్ వర్మ 41 పరుగులతో రాణించాడు. అయితే చివర్లో ఉత్కంఠ నెలకొన్నప్పటికి ఆఖరి బంతికి టిమ్ డేవిడ్ రెండు పరుగులు తీసి ముంబైకి విజయాన్ని అందించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
అయితే మ్యాచ్ ముగిశాకా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాకా రోహిత్ శర్మ తన భార్య రితికా సదేశ్కు వీడియో కాల్ చేశాడు. అయితే రోహిత్ మాట్లాడుతూ.. ''ఇప్పుడే మ్యాచ్ అయిపోయింది. సామీ నువ్వు ట్రోఫీ చూశావా అనగానే అందుకు నో అనే సమాధానం వచ్చింది. అయితే సరే.. ఈసారి సామీ కోసం కప్ తీసుకొస్తా''.. అంటూ పేర్కొన్నాడు.
రితికాతో జరిగిన సంభాషణలో సామీ అనే పేరు రావడం అభిమానులకు ఆసక్తి కలిగించింది. మరి ఎవరా సామీ అని ఆరా తీస్తే విషయం తెలిశాకా నోరెళ్లబెట్టారు. ఎందుకంటే సామీ ఎవరో కాదు.. రోహిత్, రితికాల గారాల పట్టి.. సమైరానే. రోహిత్ తన బిడ్డ సమైరాను ముద్దుగా సామీ అని పిలుస్తుంటాడు.
ఇక రితికాతో రోహిత్ ఇంకా ఏం మాట్లాడాడంటే.. ''ఈరోజు మ్యాచ్ చాలా బాగుంది. కానీ చివరి ఓవర్ చూడలేక బయటికి, లోపలికి తిరిగాను. చివరి బంతికి నేను ముని వేళ్లపై నిలబడ్డా. కానీ ముంబై గెలిచాకా సంబరం చేసుకున్నా. కానీ గత 15 ఏళ్లలో ఐపీఎల్లో ఇలాంటి మ్యాచ్లు చాలానే చూశాను.. అలవాటైపోయింది '' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా రోహిత్, రితికాల వీడియో కాల్ను ముంబై ఇండియన్స్ తమ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Ro on call with Rits after a nail-biting win in Delhi 🥺💙#OneFamily #DCvMI #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @ImRo45 pic.twitter.com/qCXaLj8dwT
— Mumbai Indians (@mipaltan) April 12, 2023
చదవండి: అప్పుడు కోహ్లి.. ఇప్పుడు రోహిత్; బలయ్యింది మాత్రం ఒక్కడే