ఐపీఎల్-2026లో టీమిండియా పేస్ గుర్రం, ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేలవ ఫామ్ కొనసాగుతోంది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లోనూ బుమ్రా విఫలమయ్యాడు. తన శైలికి విరుద్దంగా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
జస్ప్రీత్ తన నాలుగు ఓవర్ల కోటాలో 11.20 ఏకానమీ రేటుతో ఏకంగా 45 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ సీనియర్ పేసర్ కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లో బుమ్రా మొత్తంగా కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
ప్రతీ సీజన్లో పర్పుల్ క్యాప్ రేసులో ఉండే బుమ్రా.. ఈసారి ఇలాంటి ప్రదర్శన చేయడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశమైంది.ఈ నేపథ్యలో టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిరంతరాయంగా మ్యాచ్లు ఆడటం వల్ల బుమ్రాపై వర్క్లోడ్ పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అధిక పనిభారం వల్లే బుమ్రా రాణించలేకపోతున్నాడని శాస్త్రి చెప్పుకొచ్చారు.
"బుమ్రా గత 12 నెలలుగా అవిరామంగా క్రికెట్ ఆడుతున్నాడు. ఈ భారీ వర్క్లోడ్తో అతడు ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అతడు శారీరకంగా, మానసికంగా అలిసిపోయినట్లు కన్పిస్తున్నాడు. అతడు పేలవ ప్రదర్శనకు ఇది ప్రధాన కారణం. ముంబై ఇండియన్స్ బుమ్రా పట్ల జాగ్రత్త వహించాలి.
రాబోయే రెండు ఏళ్లలో భారత జట్టు బిజీ షెడ్యూల్తో గడపనుంది. పలు టెస్టు సిరీస్లు, అలాగే వన్డే ప్రపంచ కప్ వంటి కీలక టోర్నమెంట్లు జరగనున్నాయి. బుమ్రా భారత జట్టకు చాలా కీలకం కాబట్టి, ముంబై మేనెజ్మెంట్ అతడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని" ఛాంపియన్స్ వాలీ కామెంటరీ కార్యక్రమంలో రవిశాస్త్రి పేర్కొన్నారు.
చదవండి: IPL 2026: 'వావ్ వాట్ ఏ ప్లేయర్.. ఏ మాత్రం మారలేదు'


