ఢాకా వేదికగా ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో 11 పరుగుల తేడాతో పాకిసతాన్ ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1తో పాక్ కోల్పోయింది. 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 279 పరుగులకు ఆలౌటైంది.
వైస్ కెప్టెన్ సల్మాన్ అఘా(106), షాహీన్ అఫ్రిది(37) ఆఖరి పోరాడినప్పటికి జట్టును గెలిపించలేకపోయారు. దీంతో 11 ఏళ్ల తర్వాత బంగ్లాకు వన్డే సిరీస్ను పాక్ సమర్పించుకుంది. అయితే ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది.
ఏమి జరిగిందంటే?
పాకిస్తాన్ విజయానికి చివరి ఓవర్లో 14 పరుగులు కావాలి. ఆ ఓవర్ వేసే బాధ్యతను బంగ్లా కెప్టెన్ స్పిన్నర్ రిషాద్కు అప్పగించాడు. రిషాద్ తొలి రెండు బంతులకు ఎలాంటి పరుగులు రాలేదు. ఆ తర్వాత మూడో బంతికి రెండు పరుగులు వచ్చాయి. నాలుగో బంతి డాట్ అయింది.
ఐదో బంతిని రిషాద్ లెగ్ సైడ్ వేశాడు. ఆ బంతిని షాహీన్ డౌన్ ది లెగ్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ షాట్ కనక్ట్ కాలేదు. దీంతో అంపైర్ వైడ్గా ప్రకటించాడు. అయితే వికెట్ కీపర్ లిట్టన్ దాస్ సూచన మేరకు బంగ్లా కెప్టెన్ రివ్యూకు వెళ్లాడు. అయితే ఇక్కడే వివాదం చోటు చేసుకుంది.
రూల్స్ ప్రకారం ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయం ప్రకటించిన 15 సెకన్లలోపే డీఆర్ఎస్ కోరాలి. కానీ నిర్ణీత సమయం ముగిసిన తర్వాత కూడా రివ్యూకు అంపైర్ అనుమతించడంపై పాక్ అసహనం వ్యక్తం చేసింది. బంగ్లా కెప్టెన్ స్క్రీన్పై రీప్లే చూసిన తర్వాతే రివ్యూ కోరాడని పాక్ ఆరోపిస్తోంది. ఇదే విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: అతడి ఆట అసాధారణం.. గంభీర్పై ద్రవిడ్ ప్రశంసలు


