Shoaib Akhtar: డేట్‌ గుర్తుపెట్టుకోండి.. దెబ్బకు దెబ్బ తీయాలి

Pak Vs Nz: Shoaib Akhtar Pakistan Respond NZ With Full Strength T20 WC - Sakshi

Shoaib Akhtar On Pak Vs Nz In T20 World Cup: పరిమిత ఓవర్ల సిరీస్‌ ప్రారంభమవడానికి కొద్ది నిమిషాల ముందు న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు పాకిస్తాన్‌ పర్యటన రద్దు చేసుకోవడాన్ని పాక్‌ మాజీ ఆటగాళ్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తమ దేశంలో భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని, హామీ ఇచ్చి కూడా సిరీస్‌ రద్దు చేసుకోవడం దారుణమని మండిపడుతున్నారు. రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ సైతం.. న్యూజిలాండ్‌ పాక్‌ క్రికెట్‌ను చంపేసిందంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కివీస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు అక్తర్‌.

వచ్చే నెలలో ఆరంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌ నేపథ్యంలో దెబ్బకు దెబ్బ తీయాలంటూ తమ జట్టుకు సూచించాడు. ఈ మేరకు.. ‘‘తేదీ గుర్తుపెట్టుకోండి గయ్స్‌. అక్కడే మన బలమేమిటో రుచి చూపించాలి’’ అని ట్వీట్‌ చేశాడు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌- న్యూజిలాండ్‌ అక్టోబరు 26న జరిగే మ్యాచ్‌ విషయాన్ని గుర్తు చేశాడు. కాగా భద్రతా కారణాల రీత్యా టూర్‌ రద్దు చేసుకున్నట్లు కివీస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో సెప్టెంబరు 17న ఆరంభం కావాల్సిన వన్డే సిరీస్‌ ఆకస్మికంగా ఆగిపోయింది. ఈ విషయంపై స్పందించిన పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం.. ‘‘ఈ ప్రకటన మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ సిరీస్‌తో పాకిస్తాన్‌ క్రికెట్‌ అభిమానుల ముఖాల్లో చిరునవ్వులు పూస్తాయని భావించాం. మా దేశ భద్రతా సంస్థల మీద పూర్తి నమ్మకం ఉంది’’ అని కివీస్‌ తీరును విమర్శించాడు. కాగా 18 ఏళ్ల క్రితం న్యూజిలాండ్‌ ఆఖరిసారిగా పాక్‌లో పర్యటించింది.

చదవండి: మ్యాచ్‌కు ముందు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.. భయంతో వణికిపోయాం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top