
దేశవాలీ క్రికెట్లో విదర్భ ఆటగాడు కరుణ్ నాయర్ (Karun Nair) పరుగుల ప్రవాహం కొనసాగుతుంది. ఇటీవల ముగిసిన విజయ్ హజారే వన్డే ట్రోఫీలో (VHT) ఆకాశమే హద్దుగా చెలరేగిన కరుణ్.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలోనూ (Ranji Trophy) అదే స్థాయిలో రాణిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 7 ఇన్నింగ్స్ల్లో ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 779 పరుగులు చేసిన కరుణ్.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో తమిళనాడుపై బాధ్యతాయుతమైన సెంచరీతో (122) మెరిశాడు.
ఈ మ్యాచ్లో కరుణ్ శతక్కొట్టడంతో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 353 పరుగులకు ఆలౌటైంది. జట్టు కష్టాల్లో (44/3) ఉన్నప్పుడు బరిలోకి దిగిన కరుణ్.. దనిశ్ మలేవార్ (75), హర్ష్ దూబేతో (69) కలిసి ఇన్నింగ్స్ను నిర్మించాడు. విదర్భ ఇన్నింగ్స్లో ఈ ముగ్గురూ మినహా ఎవరూ రాణించలేదు.
అథర్వ తైడే 0, ధృవ్ షోరే 26, ఆధిత్య థాకరే 5, యశ్ రాథోడ్ 13, అక్షయ్ వాద్కర్ 24, భూటే 2, యశ్ ఠాకూర్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. తమిళనాడు బౌలర్లలో సోనూ యాదవ్, విజయ్ శంకర్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. మొహమ్మద్ 2, అజిత్ రామ్, మొహమ్మద్ అలీ ఓ వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన తమిళనాడు మూడో రోజు తొలి సెషన్ సమయానికి తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.
ప్రదోశ్ రంజన్పాల్ (51), సోనూ యాదవ్ (24) క్రీజ్లో ఉన్నారు. తమిళనాడు ఇన్నింగ్స్లో మొహమ్మద్ అలీ 4, ఎన్ జగదీశన్ 22, సాయి సుదర్శన్ 7, భూపతి కుమార్ 0, విజయ్ శంకర్ 22, ఆండ్రీ సిద్దార్థ్ 65, సాయికిషోర్ 7, మొహమ్మద్ 1 పరుగు చేసి ఔటయ్యారు. విదర్భ బౌలర్లలో ఆధిత్య ఠాకరే 4 వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్ 2, నిచికేత్ భూటే, హర్ష్ దూబే తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 133 పరుగులు వెనుకపడి ఉంది.
గతేడాది మొత్తం కొనసాగిన కరుణ్ హవా
కరుణ్ గతేడాది మొత్తం ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. మహారాజా ట్రోఫీతో కరుణ్ పరుగుల ప్రవాహం మొదలైంది. టీ20 ఫార్మాట్లో జరిగిన ఆ టోర్నీలో కరుణ్ 10 మ్యాచ్ల్లో 188.4 స్ట్రయిక్రేట్తో, 70 సగటున 490 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద శతకాలు, ఓ శతకం ఉంది.
కరుణ్ గత సీజన్ రంజీ సీజన్లోనూ రెచ్చిపోయి ఆడాడు. 17 ఇన్నింగ్స్ల్లో 40.58 సగటున 690 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ శతకాలు, 2 శతకాలు ఉన్నాయి.
కరుణ్ గతేడాది కౌంటీ క్రికెట్లోనూ చెలరేగి ఆడాడు. 11 ఇన్నింగ్స్ల్లో 48.70 సగటున 487 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ సహా మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ కరుణ్ విధ్వంసం కొనసాగింది. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్ల్లో 177.08 స్ట్రయిక్రేట్తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.
విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ ఫామ్ పతాకస్థాయికి చేరింది. ఈ టోర్నీలో కరుణ్ 7 ఇన్నింగ్స్ల్లో 389.50 సగటున, 124.04 స్ట్రయిక్రేట్తో ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 779 పరుగులు చేశాడు.