
న్యూఢిల్లీ టెస్ట్లో భారత్ గెలుపు కోసం చివరి రోజు వరకు ఆగాల్సి వచ్చింది. చివరి సెషన్లో విండీస్ నిర్దేశించిన 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 63 పరుగులు (18 ఓవర్లు) చేసింది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 58 పరుగులు చేయాల్సి ఉంది.
స్వల్ప లక్ష్య ఛేదనలో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ (8) ఆదిలోనే ఔట్ కాగా.. కేఎల్ రాహుల్ (25 నాటౌట్), సాయి సుదర్శన్ (30 నాటౌట్) భారత్ను విజయం దిశగా తీసుకెళ్తున్నారు. జైస్వాల్ వికెట్ వారికన్కు దక్కింది.
ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా 2 మ్యాచ్ల సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేస్తుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటం
అంతకుముందు విండీస్ ఫాలో ఆడుతూ అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించింది. ఆ జట్టు బ్యాటర్లు ఊహించని రీతిలో ప్రతిఘటించి భారత్ ముందు మూడంకెల టార్గెట్ను ఉంచారు.
క్యాంప్బెల్, హోప్ వీరోచిత శతకాలు
తొలుత జాన్ క్యాంప్బెల్ (115), షాయ్ హోప్ (103) వీరోచిత శతకాలు బాది విండీస్కు ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించారు. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జేడన్ సీల్స్ (32) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమిండియా ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.
గ్రీవ్స్, సీల్స్ చివరి వికెట్కు 79 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా తలో 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.
దీనికి ముందు కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు.
చదవండి: కొడుకు 6 వారాల్లో 10 కిలోలు తగ్గితే.. తండ్రి ఆర్నెళ్లలో 38 కేజీలు ఉఫ్!.. వీరి సీక్రెట్ ఇదే