ఢిల్లీ డైరెక్టర్ వేణుగోపాలరావు
న్యూఢిల్లీ: ఐపీఎల్ తాజా సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శనపై టీమ్ డైరెక్టర్ వేణుగోపాల రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అన్ని విభాగాల్లో తాము విఫలమయ్యామని అతను అంగీకరించాడు. ఇది 18 ఏళ్ల బాధ అని వేణు వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ మొదలైన 2008 నుంచి ఇప్పటి వరకు లీగ్ ఉంటూ ఒక్క సారి కూడా టైటిల్ గెలవని రెండు జట్లలో ఒకటి పంజాబ్ కాగా మరొకటి ఢిల్లీ. 2020లో చివరిసారిగా ఫైనల్ చేరిన ఢిల్లీ ఆ తర్వాత అలాంటి స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయింది. ‘నిజంగానే ఇది చాలా బాధిస్తుంది. 18 ఏళ్లుగా ఆడుతున్నా టైటిల్ లేకపోవడం నిరాశాజనకం.
నేను ఈ టీమ్ను ఆడినప్పుడు కూడా గెలవాలని ఎంతో కోరుకున్నా. ఇప్పుడు కోచింగ్, పరిపాలనా వ్యవహారాల్లోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి. ఇంకా చక్కదిద్దుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి’ అని వేణుగోపాలరావు అన్నాడు. ఆడిన 11 మ్యాచ్లలో 4 మాత్రమే గెలిచిన క్యాపిటల్స్ 7 ఓడింది. ‘ఒక్కో మ్యాచ్లో మా ఓటమికి ఒక్కో కారణం ఉంది. అయితే గత రెండు మ్యాచ్లను చూస్తే బ్యాటర్లు మరింత బాధ్యత తీసుకోవాల్సిందని అనిపించింది. ఎందుకంటే సీజన్ మొదట్లో కొన్ని మ్యాచ్లలో తక్కువ వ్యవధిలో వికెట్లు పడ్డా ఇతర బ్యాటర్లు రాణించి జట్టును గెలిపించారు’ అని వేణుగోపాలరావు విశ్లేషించాడు.


