క్రికెట్లో ఒకప్పుడు బ్యాటర్లకు భయం పుట్టించిన యార్కర్లు ఇప్పుడు కనిపించడం లేదు. చేజింగ్ సమయంలో బ్యాటింగ్ చేసే జట్టులో ఆందోళన పెరిగి, సమీకరణం ఉత్కంఠభరితంగా మారినప్పుడు, ఆయా కెప్టెన్లు ఒక బంతినే నమ్ముకునేవారు. అదే సంప్రదాయ యార్కర్. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మలింగ, బుమ్రా లాంటి యార్కర్ల స్పెషలిస్టులు విసిరే యార్కర్లకు బ్యాటర్లకు ఫ్యూజులు ఎగిరేవి.
ఐపీఎల్లోనూ యార్కర్లకు స్వర్ణయుగం నడిచింది. ఆఖరి బంతి దాకా విజయం దోబుచులాడే టీ20 క్రికెట్లో ఇటీవలే కాలంలో మ్యాచ్లన్నీ వన్సైడ్గా మారిపోవడం చూస్తున్నాం. ఐపీఎల్లోనూ ఈ తరహా మ్యాచ్లు ఎక్కువైపోయాయి. ఐపీఎల్ 2026 సీజన్లోనూ అన్ని జట్లు 200 పరుగుల టార్గెట్ను అవలీలగా ఛేదించేస్తున్నాయి.
తాజాగా ఐపీఎల్ 19వ సీజన్లో యార్కర్ బంతులు కనిపించకపోవడంతో అటు డ్రెస్సింగ్ రూమ్లోనూ, ఇటు అభిమానుల్లోనూ ఒకటే చర్చ జరుగుతుంది. అదేంటంటే ఒకప్పుడు భయం పుట్టించిన యార్కర్లకు క్రమంగా కనుమరుగవుతున్నాయా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. నిజానికి ఈ సీజన్లో ముంబై తరఫున ఆడుతున్న బుమ్రా కావొచ్చు.. ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్న నటరాజన్ వీరంతా యార్కర్ల స్పెషలిస్టులే. కానీ ఈ సీజన్లో ఒక్కసారి కూడా వీరు తమ యార్కర్లతో ప్రభావం చూపలేకపోయారు.
బ్యాటర్లు ఫినిషింగ్ను ఒక శాస్త్రంగా మార్చుకోవడంతో, గత కొన్నేళ్లుగా డెత్ ఓవర్లలో పరుగుల రేట్లు క్రమంగా పెరిగాయి. వారు బంతి కదలికను, ముందుచూపును ఉపయోగించి చిన్నపాటి పొరపాట్లను కూడా బౌండరీలుగా మారుస్తున్నారు. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్లో డెత్ ఓవర్ల (17వ నుండి 20వ ఓవర్ల వరకు) సగటు రన్ రేట్ 9.41గా ఉండగా, అది క్రమంగా పెరిగి 2025 నాటికి 11.5కు చేరుకుంది. అదేవిధంగా, జట్టు సగటు స్కోరు 2008లో 157 నుండి 2025 నాటికి 180కి పెరిగింది.
2023లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ప్రవేశపెట్టడం కూడా స్లాగ్ ఓవర్లలో యార్కర్కు ప్రాధాన్యత తగ్గడంలో కీలక పాత్ర పోషించింది. అందుకే ఇంపాక్ట్ నిబంధనపై కూడా సీనియర్ క్రికెటర్లు, బౌలర్లు వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా ఒకప్పుడు యార్కర్లు బ్యాటర్లు బెంబెలెత్తించాయి. కానీ ఇప్పుడు అదే యార్కర్లు కనిపించకుండా పోతున్నాయి.


