Viral Video: రణరంగాన్ని తలపించిన మైదానం.. బ్యాట్లతో కొట్టుకున్న క్రికెటర్లు

Charity Match At Mote Park Cricket Club Abandoned After Massive Brawl Erupts Between Players - Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌లో జరిగిన ఓ ఛారిటీ క్రికెట్‌ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య చిన్నపాటి ఘర్షన రక్తసిక్తంగా మారింది. ఇరు జట్ల క్రికెటర్ల మధ్య మాటామాటా పెరిగి చివరికి బ్యాట్‌లతో తీవ్రంగా కొట్టుకునే దాకా వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరు ఆటగాళ్లకు తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లో వైద్యం అవసరమైన పేదల కోసం షెహజాద్ అక్రమ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఓ ఛారిటీ మ్యాచ్‌ని మైడ్‌స్టోన్‌లోని మోటే క్రికెట్ క్లబ్‌లో నిర్వహించారు. అయితే మంచి ఉద్దేశంతో నిర్వహించిన ఈ మ్యాచ్ చివరికి రక్తసిక్తంగా మారడం చర్చనీయాంశంగా మారింది. గొడవకి కారణం ఏంటనే విషయం వెలుగులోకి రానప్పటికీ.. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వీడియో కనిపించిన దృష్యాల ప్రకారం.. బ్యాట్స్‌మెన్ ఓ ఫీల్డర్‌పై దాడికి దిగినట్లు తెలుస్తోంది. దాంతో.. ఇరుజట్ల ఆటగాళ్లు బాహాబాహీకి దిగినట్లు స్పష్టమవుతోంది. అనంతరం రెండు గ్రూప్‌ల ఆటగాళ్లు బ్యాట్‌లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ కనిపించారు. మధ్యలో అంపైర్లు, మ్యాచ్ నిర్వాహకులు వారిని కట్టడి చేసే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. గొడవ సద్దుమణిగే సమయానికి ఇద్దరు ఆటగాళ్లు దెబ్బలకి తాళలేక కిందపడిపోయి కనిపించారు. దీంతో మ్యాచ్‌ అర్ధంతరంగా రద్దైంది.

కాగా, ఈ గొడవ విషయమై మ్యాచ్‌ నిర్వహకుడు షెహజాద్‌ స్పందిస్తూ.. ఇది ఫైనల్ మ్యాచ్‌ అని, మరో రెండు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందన్న దశలో కొందరు గ్రౌండ్‌లోకి వచ్చి గొడవ స్టార్ట్ చేశారని, ఓ ఇద్దరు ముగ్గురు బ్యాట్‌లతో ఆటగాళ్లని తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నాడు. మొత్తంగా ఛారిటీ మ్యాచ్ ఉద్దేశాన్ని నాశనం చేశారని నిరాశ వ్యక్తం చేశాడు. అయితే గొడవకు అసలు కారణం ఏంటన్నది తనకు కూడా తెలియదని అతను చెప్పడం విశేషం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top