Asian Games 2023: Hangzhou Cricket Stadium's Strange Shape Shock Fans - Sakshi
Sakshi News home page

Asian Games 2023: ఇదేం క్రికెట్‌ స్టేడియం.. చైనాపై పెదవి విరుస్తున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌

Jul 18 2023 7:56 AM | Updated on Jul 18 2023 8:51 AM

Asian Games: Cricket Stadium-Strange Shape Shock Fans-Hangzhou-China - Sakshi

ఏషియన్‌ గేమ్స్‌ 2023కి ఈసారి చైనా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 8 వరకు చైనాలోని హాంగ్జూ నగరం వేదిక కానుంది. ఈసారి గేమ్స్‌లో క్రికెట్‌ ఆడేందుకు బీసీసీఐ టీమిండియా పరుషుల, మహిళల జట్లను పంపనుంది. ఇప్పటికే ఆసియా గేమ్స్‌లో పాల్గొనే టీమిండియా జట్లను ప్రకటించింది. పురుషుల జట్టును రుతురాజ్‌ గైక్వాడ్‌ నడిపించనుండగా.. మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారధ్యం వహించనుంది. 

ఇక చైనాలో క్రికెట్‌ ఆడడం చాలా తక్కువ. అక్కడి వాళ్లు ఎక్కువగా ఇండోర్‌ గేమ్స్‌ సహా ఇతర క్రీడలు ఎక్కువగా ఆడుతుంటారు. అందుకే చైనాలో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాలు లేవు. ఉన్నా ఏదో మొక్కుబడిగా నిర్మించినట్లుగా అనిపిస్తుంది. అయితే తాజాగా ఆసియా గేమ్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడంతో  హాంగ్జూ నగరంలో క్రికెట్‌ స్టేడియాన్ని నిర్మించారు.

మాములుగా క్రికెట్‌ ఆడే మైదానాలు గుండ్రంగా ఉండడమే లేదంటే కాస్త స్క్కేర్‌ షేప్‌లో ఉండడం చూస్తాం. కానీ ఆసియా గేమ్స్‌ కోసం  హాంగ్ఝౌలో నిర్మించిన క్రికెట్‌ స్టేడియం కాస్త వింతగా అనిపిస్తుంది. హాకీ మైదానాన్ని తలపించేలా ఉన్న స్టేడియంలో స్ట్రెయిట్స్‌ ఎక్కువ దూరం ఉంటే.. ఆఫ్‌సైడ్‌, లెగ్‌ సైడ్‌ బౌండరీలు చిన్నవిగా కనిపిస్తున్నాయి. దీంతో క్రికెట్‌ స్టేడియాలు ఇలా కూడా ఉంటాయా అంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ పెదవి విరుస్తున్నారు.

స్టేడియం షేపు వింతగా ఉన్నా.. ఇక్కడి అత్యాధునిక సౌకర్యాలు మాత్రం ప్రేక్షకులకు ఓ కొత్త క్రికెట్ మ్యాచ్ అనుభవాన్ని అందించనున్నాయి. హాంగ్జూలోని ఈ క్రికెట్ స్టేడియంలో 12 వేల మంది కూర్చొని మ్యాచ్ చూడొచ్చు. దీని అద్భుతమైన డిజైన్, చుట్టూ పచ్చదనం, అత్యాధునిక సౌకర్యాలు ఫ్యాన్స్ ను ఆకర్షిస్తున్నాయి. పైగా బౌండరీలు కూడా దగ్గరగా ఉండటంతో ఆసియా గేమ్స్ లో భారీ స్కోర్లు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. చైనాలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియం ఇదే కావడం విశేషం.

ఇక ఐదేళ్ల తర్వాత ఏషియన్‌ గేమ్స్‌లోకి క్రికెట్ తిరిగి వస్తుండటంతో ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2010 ఏషియన్‌ గేమ్స్ లో తొలిసారి క్రికెట్ ఎంట్రీ ఇచ్చింది. అయితే 2018లో జకార్తాలో జరిగిన గేమ్స్ నుంచి క్రికెట్ ను తొలగించారు. 2010, 2014లలో టి20 ఫార్మాట్ లో క్రికెట్ గేమ్స్ నిర్వహించారు. చివరిసారి ఆసియా గేమ్స్ జరిగినప్పుడు ఇండియా జట్టును పంపలేదు. ఈసారి రుతురాజ్ కెప్టెన్సీలో యంగ్ టీమ్ ను పంపిస్తోంది. ఈసారి ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకురావడమే తన లక్ష్యమని రుతురాజ్ అన్నాడు. గతంలో బంగ్లాదేశ్, శ్రీలంకలు గోల్డ్ మెడల్స్ గెలిచాయి. వుమెన్స్ కేటగిరీలో రెండుసార్లూ పాకిస్థాన్ ఖాతాలోకే మెడల్స్ వెళ్లాయి.

చదవండి: Lionel Messi: సీజన్‌కు రూ.492 కోట్ల చొప్పున.. మియామి క్లబ్‌కు మెస్సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement