ఎన్నికల విధులు వద్దు
టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల విధుల నుంచి దివ్యాంగ ఉపాధ్యాయులకు మినహాయించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి సోమవారం సిద్దిపేటలో అన్నారు. రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు వేయడం తగదన్నారు. కొంతమంది ఉపాధ్యాయులను అసలే తీసుకోలేదని, వచ్చినవారికి మూడు డ్యూటీలు వేశారని ఆరోపించారు. ముందస్తు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా శిక్షణలకు పంపించడం, సుదూర ప్రాంతాల్లో ఎన్నికల విధులు కేటాయించడం వలన ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మానవతా దృక్పథంతో ఎన్నికల విధులనుంచి మినహాయించాలని ఆయన కోరారు.
నాడు పతులు.. నేడు సతులు
చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని వీరన్నపేట సర్పంచ్గా గత ఎన్నికల్లో భర్తలు ప్రత్యర్థులుగా పోటీ పడ్డారు. నేటి ఎన్నికల్లో వారి భార్యలు ప్రధాన పార్టీల మద్దతుతో పోటీలో నిలిచారు. నాడు కొండపాక భిక్షపతి, ఎలికట్టె శివశంకర్ పోటీ పడగా భిక్షపతి సర్పంచ్గా గెలిచారు. తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో ఎలికట్టె శివశంకర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలుపొందారు. ప్రస్తుతం గ్రామ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో అధికార పార్టీ మద్దతుతో భిక్షపతి భార్య కనకలక్ష్మి, బీఆర్ఎస్ మద్దతుతో ఎలికట్టె శివశంకర్ భార్య శైలజ బరిలో నిలిచారు.
దరఖాస్తుల ఆహ్వానం
హుస్నాబాద్: రేణుకా ఎల్లమ్మ దేవాలయ కమిటీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లమ్మ జాతర సందర్భంగా నెల రోజుల పాటు ఉత్సవ కమిటీ వేశారు. ఆ గడవు ముగిసింది. ప్రస్తుతం కొత్తగా ఆసక్తి గల అభ్యర్థులు సంగారెడ్డి సహాయ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆలయ కమిటీ కార్యనిర్వాహణ అధికారి కిషన్రావు పేర్కొన్నారు.
నేడు విజయోత్సవ వేడుకలు
సిద్దిపేటజోన్: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ 9 పురస్కరించుకుని మంగళవారం తెలంగాణ విజయోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్రెడ్డి పేర్కొన్నారు. ఉదయం 10గంటలకు కోటిలింగాల దేవాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్లు పంపిణీ, మోడల్ బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు.
మద్యం కొనొద్దని
వినూత్న నిరసన
సిద్దిపేటజోన్: మద్యం కొనొద్దని బీజేపీ నేతలు వినూత్న నిరసనకు దిగారు. పట్టణ శివారులో దేవాలయం సమీపంలో వైన్స్ ఏర్పాటు చేశారని, వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణ అధ్యక్షుడు వెంకట్ ఆధ్వర్యంలో మద్యం దుకాణం ఎదుట మద్యం కొనొద్దని ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతిపజేశారు.
పనిచేసిన చోటే
ప్రజాప్రతినిధిని కావాలని..
సిద్దిపేటఅర్బన్: మండలంలోని మిట్టపల్లి గ్రామంలో ఏడే ఎల్లవ్వ 7వ వార్డ్ సభ్యురాలిగా పోటీ చేస్తున్నారు. భర్త మరణించడంతో ఎల్లవ్వ గతంలో గ్రామ సేవకురాలిగా పనిచేశారు. ఇప్పుడు తమ వార్డు రిజర్వేషన్ ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో వార్డు మెంబర్గా పోటీలో నిలిచారు. తాను గెలిచి చిరుద్యోగిగా పనిచేసిన చోటే ప్రజా ప్రతినిధిగా సేవలందిస్తానని చెప్తున్నారు.
సర్పంచ్ బరిలో ముగ్గురు రేషన్ డీలర్లు
బెజ్జంకి(సిద్దిపేట): ముగ్గురు రేషన్ డీలర్లు సర్పంచ్లుగా పోటీ చేస్తున్నారు. బెజ్జంకి సర్పంచ్గా బొల్లం శ్రీధర్(పెద్దన్న), రేగులపల్లెలో దుంబాల పద్మ, దేవక్కపల్లెలో పడాల సత్యనారాయణ బరిలో ఉన్నారు. ప్రజలతో ఉన్న సత్సంబంధాలే తమకు విజయం చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల విధులు వద్దు


