
డొక్కలు చిక్కి .. బొక్కలు తేలి
నాచగిరీశా.. నీ చెంతనే గోవుల గోస
● అల్లాడుతున్న ‘ఆలమంద’
● కాపరికి స్వీపర్ బాధ్యతలు..
గోశాల దాటని ఆవులు
● ఎవరూ పట్టించుకోని దైన్యం
వర్గల్(గజ్వేల్): గోమాతలు బక్కచిక్కుతున్నాయి. ఆకలితో అలమటిస్తున్నాయి. సరైన తిండి లేదన్నట్లు బొక్కలు తేలాయి. సంరక్షణకు ప్రత్యేకంగా కాపరి, రూ.10 లక్షల విలువైన చక్కని గోశాల, యేడాదికి దాదాపు రూ. 2 లక్ష విలువైన పశుగ్రాసం, ఎకరాలకొద్ది ఆలయ భూములు, తదితర సంరక్షణ సౌకర్యాలున్న నాచగిరిలో ‘బక్కచిక్కి, డొక్కలు తేలిన ఆవులు’ గోసంరక్షణ తీరును అభాసుపాల్జేస్తున్నాయి. నిర్వహణ లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలోనే రెండో యాదాద్రిగా నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం ప్రసిద్ధిపొందింది. రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు గో పూజ, గోదానం, కోడె మొక్కు ద్వారా స్వామివారికి ఆవులు, కోడెలను సమర్పిస్తుంటారు. ఈ విధంగా నాచగిరి స్వామివారికి సమర్పించిన ఆవులు, కోడెలు, వాటికి పుట్టినవి కలిపి 26 ఉన్నాయి. అందులో 18 ఆవులు, 2 కోడెలు, 6 లేగలున్నాయి.
రూ.10 లక్షలతో విశాలమైన గోశాల
నాచగిరి క్షేత్రంలో ఆలమంద సంరక్షణ, గోపూజకు వీలుగా హైదరాబాద్కు చెందిన కందుకూరి వీరేశం అనే దాత రూ.10 లక్షల పైచిలుకు నిధులు వెచ్చించి విశాలమైన గోశాలను నిర్మింపజేశారు. మరోవైపు పశువుల సంరక్షణ బాధ్యతలు నిర్వహించేందుకు నెలకు రూ.32,407 వేతనం పొందుతున్న స్వీపర్ను ప్రత్యేకంగా పశువుల కాపరిగా ఆలయ ఈఓ నియమించారు. ఉదయం, సాయంత్రం పశువులను బయటకు మేతకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కాపరిదే. పశువులు మాత్రం గోశాల దాటడం లేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే తనకు అదనంగా స్వీపర్ బాధ్యతలు కూడా చెబుతున్నారని సదరు పశువుల కాపరి బాల్రాజు పేర్కొంటున్నాడు. దీంతో పశువులు గోశాలకే పరిమితమై గ్రాసం కోసం అలమటించడం సాధారణంగా మారింది. అధికారుల పర్యవేక్షణ కూడా కొరవడింది.
భూములున్నా.. పశుగ్రాసం కొనుగోలు
నాచగిరి ఆలయానికి నాచారం, వేలూరు, అనంతగిరిపల్లి, తున్కిఖాల్సా, మీనాజీపేట, అల్లాపూర్, యావాపూర్, రామారం తదితర గ్రామాలలో సాగు భూములున్నాయి. వీటిని లీజు ప్రాతిపదికన రైతులకు ఇచ్చారు. వీటి ద్వారానే కాకుండా, దాతల ద్వారా పశుగ్రాసం పొందే అవకాశముంది. గత సంవత్సరం 2024–25 లెక్కల ప్రకారం 12 నెలల కాలంలో పశువుల కోసం రూ. 2,37,750 పశుగ్రాసాన్ని కొనుగోలు చేశారు. వీటిని సరిగ్గా వినియోగిస్తే పశువులు పరిపుష్ఠిగా, ఆరోగ్యవంతంగా ఉంటాయని, కానీ ఇందుకు భిన్నంగా బొక్కలు తేలి, బక్కచిక్కి కనపడుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గోశాలలో బక్కచిక్కి, బొక్కలు తేలిన గోవు
జాగ్రత్తలు తీసుకుంటున్నాం
నాచగిరి క్షేత్రంలోని గోశాలలో 26 వరకు ఆవులు, కోడెలు, దూడెలున్నాయి. ఆలయ పశుగణం సంరక్షణకు ప్రక్షాళన చర్యలు చేపడుతున్నాం. పశువుల కాపరి కేవలం పశువుల రక్షణకే పరిమితం చేస్తూ ఆదేశించాం. అతనికి ఎలాంటి అదనపు బాధ్యతలు లేవు. నిరంతరం పశు సంరక్షణలోనే ఉండాలని, ఉదయం, సాయంత్రం మేతకోసం తీసుకెళ్లాలని నిర్దేశించాం.
– విజయరామారావు,
నాచగిరి ఆలయ కార్యనిర్వహణాధికారి

డొక్కలు చిక్కి .. బొక్కలు తేలి

డొక్కలు చిక్కి .. బొక్కలు తేలి