
నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
హాజరుకానున్న 1,169 మంది విద్యార్థులు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం నుంచి ఈ నెల 13 వరకు పరీక్షలు జరగనున్నాయి. రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. 1,169 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జిల్లాలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సిద్దిపేట, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిద్దిపేట, తెలంగాణ మోడల్ స్కూల్ గజ్వేల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ప్రజ్ఞాపూర్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఉదయం 8.30గంటల వరకు పరీక్ష కేంద్రానికి హాజరుకావాలన్నారు.
జేఈఈ అడ్వాన్స్డ్లో
65వ ర్యాంకు
కొమురవెల్లి(సిద్దిపేట): జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో మండలంలోని అయినాపూర్ విద్యార్థి 65వ ర్యాంకు సాధించారు. గ్రామానికి చెందిన తాళ్లపల్లి పాండురంగం కుమారుడు తాళ్లపల్లి వెంకటేశ్ జేఈఈ అడ్వాన్స్లో సత్తా చాటారు. అంతే కాకుండా గత నెల 11న విడుదలైన తెలంగాణ ఈఏపీసెట్లోనూ 22వ ర్యాంకు సాధించారు. దీంతో గ్రామానికి చెందిన పలువురు అతనిని అభినందించారు.
రవాణా శాఖ ఇన్చార్జి
అధికారిగా లక్ష్మణ్
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా రవాణా శాఖ ఇన్చార్జి అధికారిగా లక్ష్మణ్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన క్రిస్టోఫర్ స్థానంలో సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ను ఇన్చార్జిగా నియమిస్తూ కమిషనర్ ఉత్తరులు జారీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు రవాణాశాఖ పరంగా మెరుగైన సేవలు అందిస్తామన్నారు.
మల్లన్న సాగర్ను
సందర్శించిన ఏసీపీ
తొగుట(దుబ్బాక): మండలంలోని కొమురవెల్లి మల్లన్న సాగర్ను గజ్వేల్ ఏసీపీ నర్సింహు లు సోమవారం సందర్శించారు. పంప్హౌస్, రిజర్వాయర్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ నిర్మాణం, సాగునీరు, తాగునీటి వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని డీఈ చెన్ను శ్రీనివాస్ ఏసీపీకి వివరించారు. అంతకు ముందు లింగాపూర్ శివారు లోని వైష్ణవి కన్స్ట్రక్షన్స్ కు సంబంధించిన ఎక్స్ఫ్లోజీవ్ (డిటోనెటర్లు భద్రపరిచే) గోదాంను ఏసీపీ పరిశీలించారు. గోదాంకు సంబంధించిన అనుమతి పత్రాలు, స్టాక్ రికార్డులను ఆయన పరిశీలించారు. గోదాములో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. గోదాం వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని ఏసీపీ సూచించారు. కార్యక్రమంలో తొగుట ఎస్ఐ రవికాంత్రావు పాల్గొన్నారు.
దుద్దెడలో తనిఖీలు
కొండపాక(గజ్వేల్): దుద్దెడ శివారులోని కిరాణా దుకాణాలు, హోటళ్లు, పాన్ షాపుల్లో సోమవారం రాత్రి నార్కోటిక్ డాగ్తో తనిఖీలు చేపట్టారు. ఈసందర్భంగా సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ డ్రగ్స్, మత్తు పదార్థాలతో కూడిన చాక్లెట్స్ రవాణా, విక్రయాలు జరగకుండా తనిఖీలు చేస్తున్నామన్నారు. మత్తు పదార్థాలను విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు.

నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు

నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు