
త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ
ప్రశాంత్నగర్(సిద్దిపేట): పార్టీలో కష్టపడిన వారిని గుర్తిస్తూ త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అంతకు ముందు రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ మనుచౌదరి, సీపీ అనురాధ, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్తో కలిసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడవద్దని మీకు అండగా ఎప్పటికీ అందుబాటులో ఉంటామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు హరికృష్ణ, అత్తు ఇమామ్, లక్ష్మి, బొమ్మల యాదగిరి, కలీమొద్దిన్, ఎల్లం యాదవ్, ఆనంద్, గోపీకృష్ణ, సతీష్, తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు
నాయకులకు, కార్యకర్తలకు
అండగా ఉంటాం
మంత్రి పొన్నం ప్రభాకర్