
సిద్దిపేటలో బంద్ ప్రశాంతం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): విశ్వహిందుపరిషత్ మెదక్ సహ కార్యదర్శి గ్యాదరి రాజారాంపై దాడిని నిరసిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో బంద్ నిర్వహించారు. పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే సుభాష్రోడ్డు, లాల్కమాన్, గాంధీ చౌరస్తా, తదితర ప్రధాన వ్యాపార సముదాయాల ప్రాంతాలు బోసిపోయాయి. సిద్దిపేట సీపీ అనురాధ క్షేత్ర స్థాయిలో శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బంద్ సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు సహకరించాలని కోరారు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. లేదంటే అత్యవసర సమయంలో డయల్ 100, సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నెంబర్ 8712667100 కాల్ చేసి వివరాలు తెలపాలని సూచించారు. వెంటనే సంబంధిత పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, ఏది నిజం ఏది అబద్దం ముందుగా తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బందోబస్తులో ఏసీపీ రవీందర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఏడు చెక్పోస్ట్లు..
పశువుల అక్రమ రవాణా నియంత్రణకు జిల్లాలో ఏడు చెక్పోస్ట్లు ఏర్పాటు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి చౌరస్తాలోని చెక్పోస్ట్ను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో రంగధాంపల్లి చౌరస్తా, సిద్దిపేట రూరల్ పీఎస్ చౌరస్తా, అనంతసాగర్, అక్బర్ పేట భూంపల్లి చౌరస్తా, అనభేరి చెక్పోస్ట్ హుస్నాబాద్, గుర్జకుంట క్రాస్ రోడ్, వంటిమామిడి చౌరస్తాల వద్ద పోలీస్, పశుసంవర్ధక శాఖ సిబ్బందితో చెక్పోస్ట్లను నిర్వహిస్తున్నామన్నారు.