
అక్రమాలకు ఐదేళ్లు.. రికవరీకి ఎన్నాళ్లు?
పట్టణ సమైక్యలో రూ.17 లక్షలు గోల్మాల్
● 2021లోనే అవకతవకలు గుర్తింపు ● నేటికీ జప్తు చేయని అధికారులు ● నష్టపోతున్న మహిళా సంఘ సభ్యులు
పట్టణ సమైక్యలో అవకతవకలు జరిగినా డబ్బులు రికవరీ ప్రశ్నార్థకంగా మారింది. ఐదేళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో మహిళా సంఘ సభ్యులు నష్టపోవాల్సి వస్తోంది. సిద్దిపేట పట్టణంలో మెప్మాలో పని చేస్తున్న అధికారుల హస్తంతోనే అక్రమాలు జరగడంతో రికవరీ కాకుండా చూస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు స్పందించి డబ్బులు రికవరీ చేయాలని బాధితులు కోరుతున్నారు. – సాక్షి, సిద్దిపేట
సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో 2,150 మహిళా సంఘాలుండగా 23,250 మంది సభ్యులున్నారు. కో ఆపరేటివ్ యాక్ట్ ద్వారా 64 స్లమ్ లెవల్ ఫెడరేషన్(ఎస్ఎల్ఎఫ్) మహిళా సమైక్యలు ఏర్పాటు చేసి రిజిస్టర్ చేశారు. ఈ స్లమ్ సమైక్యలు అన్నింటిని కలిపి మహిళా సంఘాలు టౌన్ లెవల్ ఫెడరేషన్(టీఎల్ఎఫ్)ను ఏర్పాటు చేశారు. దీనిలో ప్రతీ సభ్యురాలు నెలకు రూ.10 చొప్పున జమ చేశారు. ఇలా జమ అయిన డబ్బులను అప్పుగా ఇస్తుంటారు. ప్రతీ ఏడాది ఉన్నతాధికారులు అడిట్ నిర్వహిస్తారు.
2021లో అవకతవకలు
పొదుపు డబ్బులతో అంతర్గత అప్పులను అధ్యక్షురాలు, కోశాధికారి, ప్రధానకార్యదర్శి ఆమోదంతో ఇస్తుంటారు. అప్పుడు ఉన్న అధ్యక్షురాలు, ఇటీవల సరెండర్ అయిన టీఎంసీ ఇద్దరు కలిసి అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఎవరికి సంబంధం లేకుండా మెప్మా సిబ్బంది, మహిళలకు చెక్కులను అందజేశారు. అప్పట్లో ఆరోపణలు రావడంతో అప్పుడు ఉన్న సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి ఆదేశిస్తే జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో 2018–19, 2019–20, 2020–21లలో మూడు సంవత్సరాలు ఆడిట్ చేశారు. దీంతో దాదాపు రూ.17లక్షల వరకు సంఘం సభ్యులు కానీ వారికి చెక్ల రూపంలో డబ్బులు ఇచ్చినట్లు తేలింది.
టీఎంసీ పాత్రతో..
2021లో జరిగిన అవకతవకల్లో టీఎంసీ పాత్ర ఉండటంతో రికవరీ చేయకుండా చూశారని విశ్వసనీయ సమాచారం. ఇటీవల సిద్దిపేట మున్సిపాలిటీ టీఎంసీ (టౌన్ మిషన్ కో ఆర్డినేటర్) సంఘ సభ్యుల తొలగింపుల్లో అక్రమాలకు పాల్పడటంతో మెప్మా డైరెక్టర్కు అదనపు కలెక్టర్ సరెండర్ చేశారు. ఇప్పటికైనా టీఎల్ఎఫ్లో జరిగిన గోల్మాల్ నిగ్గు తేలాలంటే మెప్మా డైరెక్టర్, కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి డబ్బులను రికవరీ చేయాలని సంఘ సభ్యులు కోరుతున్నారు.

అక్రమాలకు ఐదేళ్లు.. రికవరీకి ఎన్నాళ్లు?