
యూనిఫాం అందేనా?
తొమ్మిది రోజుల్లో స్కూల్స్ పునఃప్రారంభం
● ఇటీవలే వచ్చిన వస్త్రం ● జిల్లాకు 3.45 లక్షల మీటర్ల క్లాత్ అవసరం ● ఇప్పటి వరకు చేరింది 1.75లక్షల మీటర్లే ● త్వరగా అందించాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు
సరిగ్గా తొమ్మిది రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులందరూ ఒకే యూనిఫాం ధరించడం వల్ల మరింత క్రమశిక్షణ అలవడుతుందన్న ఉద్దేశంతో ప్రతీ ఏటా ప్రభుత్వం ఏకరూప దుస్తులను అందజేస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే దుస్తులు పాఠశాలలకు చేరాలి. ప్రారంభమైన రోజునే విద్యార్థులకు అందించాలి. అయితే ఇటీవలే వస్త్రం వచ్చింది. దీంతో పాఠశాలల ప్రారంభం రోజే అందించడం గగనమే.
– సాక్షి, సిద్దిపేట
జిల్లాలోని 941 ప్రభుత్వ పాఠశాలల్లో 78,643 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అందులో బాలురు 37,178, బాలికలు 41,465 ఉన్నారు. 1 నుంచి 3వ తరగతి వరకు బాలికలకు ఫ్రాక్, 4, 5వ తరగతుల వారికి స్కర్ట్ ఇవ్వనున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు బాలికలకు పంజాబీ డ్రెస్, పైన కోట్. బాలురకు ప్యాంట్, షర్టుల అందించనున్నారు. ఈ ఏడాది సైతం యూనిఫాంలు కుట్టించే బాధ్యతలను డీఆర్డీఏకు అప్పగించారు. ఒక్కో జతకు రూ.75లను ప్రభుత్వం చెల్లిస్తోంది. జిల్లాలో 1,230 మహిళా సంఘాలచే కుట్టిస్తున్నారు.
78 వేల మంది విద్యార్థులు..
78,643 మంది విద్యార్థులకు యూనిఫాంల కోసం 3,45,552 మీటర్ల వస్త్రం అవసరం. ఇప్పటి వరకు మొదటి జతకు సంబంధించి జిల్లాకు 1,72,776 మీటర్ల క్లాత్ వచ్చింది. ఏప్రిల్ 17న ప్యాంట్, బాటమ్ క్లాత్ రాగా, మే 18న షర్టు క్లాత్ వచ్చింది. ఈ క్లాత్ను మండలాల వారీగా వేరు చేసి మే 22వ తేదీ వరకు అందించారు. ఇప్పటికే ప్యాంట్, నెక్కర్, బాటమ్లు కుట్టడం చివరి దశకు వచ్చింది. షర్టులు ఇటీవలనే కుట్టడం ప్రారంభించారు.
ప్రారంభం రోజున కలర్ డ్రెస్సేనా?
విద్యార్థులందరికీ యూనిఫాంలు కుట్టి ఇవ్వాలంటే కనీసం నెల రోజులు పడుతుంది. షర్టు క్లాత్ జిల్లాకు ఇటీవలే రావడంతో కొంత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. దీంతో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం రోజున కలర్ డ్రెస్తోనే హాజరు కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికై నా డీఆర్డీఏ, జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి వేగంగా కుట్టే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. పాఠశాలల పునఃప్రారంభం రోజే యూనిఫాం ఇవ్వా లని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
సకాలంలోనే అందిస్తాం
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సంబంధించిన యూనిఫాంలు ఈ నెల 5వ తేదీ వరకు అందించాలని టార్గెట్ పెట్టుకున్నాం. అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నాం. షర్ట్ క్లాత్ కొంత ఆలస్యంగా వచ్చింది. పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యాశాఖకు యూనిఫాంలు అందించేందుకు కృషి చేస్తాం.
– జయదేవ్ ఆర్యా, డీఆర్డీఓ, సిద్దిపేట
మళ్లీ పాత కొలతలే..
విద్యార్థుల వారీగా కొలతలు తీసుకుని వారికి అనుగుణంగా స్కూల్ యూనిఫాంలు కుట్టించాలన్న లక్ష్యంతో స్థానిక మహిళా సంఘాలకు అప్పగించారు. కానీ ఈ సారి సైతం తరగతుల వారీగా సైజులు కుడుతున్నారు. ఇలా కుట్టడం వలన కొందరి విద్యార్థులకు వదులుగా, మరికొందరికి టైట్గా ఉంటుండంతో మళ్లీ టైలర్ దగ్గర సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో మళ్లీ టైలర్కు రూ.100 నుంచి రూ.200 తల్లిదండ్రులు చెల్లించాల్సి వస్తోంది.