
సదస్సులు సద్వినియోగం చేసుకోండి
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
చేర్యాల(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. మంగళవారం మండలంలోని చిట్యాల, శభాష్గూడెం గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ భారతి చట్టంతో భూ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని అన్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో తొలి విడత సదస్సులు విజయవంతంగా ముగిశాయన్నారు. భూ భారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. సదస్సులలో స్వీకరించి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిర్దేశిత గడువులోపు సమస్యలు పరిష్కరించనున్నామన్నారు. మొదటి రోజు చిట్యాలలో 91, శభాష్గూడెంలో 21 దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్నాయక్, ఆర్ఐ రాజెందర్రెడ్డి, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
దూల్మిట్ట మండల కేంద్రంలో..
మద్దూరు(హుస్నాబాద్): గ్రామాల్లో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. మంగళవారం దూల్మిట్ట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిస్సింగ్ సర్వేనంబర్లు, సాదాబైనామాలు, పీఓటీ, తదితర సమస్యలను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉందన్నారు. రెవెన్యూ అధికారులు గ్రామస్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అలాగే సలాఖపూర్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 40 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తహసీల్దార్ రహీం తెలిపారు. కార్యక్రమంలో దూల్మిట్ట తహసీల్దార్ మదుసూధన్ తదితరులు పాల్గొన్నారు.