
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
రెవెన్యూ సదస్సును పరిశీలించిన కలెక్టర్ మనుచౌదరి
సిద్దిపేటఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, అంతేకాక త్వరగా సమస్య పరిష్కారం అవుతుందని కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇందుకోసమే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని వెల్లడించారు. సదస్సుల్లో పాల్గొన్న ప్రజల భూ సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ అధికారులు ప్రజల దరఖాస్తులను స్వీకరించి, వెంటనే రశీదులు ఇవ్వాలని ఆదేశించారు. సకాలంలో సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరికిరణ్, డిప్యూటీ తహసీల్దార్ ఉదయశ్రీ, ఆర్ఐ బాలయ్య, సీనియర్ అసిస్టెంట్ సంజీవ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.