
స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం
దుబ్బాకటౌన్: మున్సిపాలిటీలో స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కమిషనర్ మట్ట శ్రీనివాసరెడ్డి తెలిపారు. వానాకాలంలోఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని 100 రోజుల్లో 50 కార్యక్రమాల నిర్వహణ అనే బృహత్ ప్రణాళికకు శ్రీకారం చుట్టామన్నారు. సెప్టెంబర్ 10వ తేదీ వరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ప్రణాళికలో భాగంగా సోమవారం దుబ్బాక మున్సిపల్ కార్యాలయం నుంచి పురవీధుల గుండా స్వచ్ఛత, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం వంటి అంశాలపై సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు. గాంధీ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద రోజుల ప్రణాళికలో భాగంగా రోజు ‘ఒక చర్య– ఒక మార్పు’ అనే నినాదంతో పారిశుద్ధ్యం పనులు నిర్వమిస్తామన్నారు. ప్రతి వార్డులోని కాలనీలో, ఇళ్ల మధ్య ఖాళీ ప్రదేశాల్లో, రహదారుల్లో, మురుగు కాల్వల వద్ద బ్లీచింగ్, ఫాగింగ్ చేయడం వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అమృత మిత్ర 2.0 ద్వారా ఇంటింటికీ తాగునీరు, వన మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో ఇళ్ల ఆవరణలో, పార్కులు, చెరువు కట్టలు, శ్మశాన వాటికలు, క్రీడా ప్రాంగణాలు, ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి, సంరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మున్సిపల్ కమిషనర్ మట్ట శ్రీనివాసరెడ్డి
దుబ్బాకలో అవగాహన ర్యాలీ