
నేటి నుంచి రెవెన్యూ సదస్సులు
సిద్దిపేటరూరల్: భూభారతి చట్టం అమలులో భాగంగా మంగళవారం నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొదటి దశలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో మాత్రమే రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఇక జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. ఈ సదస్సుల్లో భూములకు సంబంధించిన సమస్యలు అర్జీల రూపంలో తీసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలన, విచారణ చేపట్టి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. భూ యజమానులు, రైతులు వారి భూ రికార్డుల్లో తప్పులు, అర్హత ఉండి రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నమోదు కాకపోవడం, విస్తీర్ణం సంబంధించిన ఇతర సమస్యలు పరిష్కరించుకునేందుకు వీలుంది. జిల్లాలో మొత్తంగా 499 గ్రామపంచాయతీలు ఉండగా 386 రెవెన్యూ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సదస్సు కొనసాగనున్నాయి.
ప్రజల వద్దకే..
ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్న క్రమంలో ప్రజల వద్దకే దరఖాస్తు పత్రాలు అందించనుంది. ఈ మేరకు భూ సమస్యలకు సంబంధించిన బాధితులు దరఖాస్తు పత్రాన్ని తీసుకుని అందులో పూర్తి వివరాలను నింపి అధికారులకు అందజేయాలి. సాధారణ పద్ధతి మాదిరిగా ఎలాంటి తెల్లపేపర్పై దరఖాస్తు రాసి ఇవ్వాల్సిన అవసరం లేదు. అధికారులకు సమస్యను వివరించి దరఖాస్తు పత్రంలో వివరాలు నమోదు చేసి అందించాలి.
తీరనున్న ఇబ్బందులు..
ధరణి, భూ సంబంధిత సమస్యలతో ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అర్జీలు పెట్టుకుంటున్న వారికి రెవెన్యూ సదస్సులు కొంత మేర ఊరట కల్పించనున్నాయి. అధికారులు గ్రామానికి వస్తున్న క్రమంలో ప్రజలు కలెక్టరేట్కు, స్థానిక తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్ళేందుకు ఆస్కారం లేదు. భూ సమస్యలు ఈ రెవెన్యూ సదస్సులోనైనా పరిష్కారం అవుతాయో ? లేదో? వేచి చూడాల్సిందే.
సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతీష్టాత్మంగా భూ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోంది. మండలాల వారీగా ప్రత్యేకాధికారులు, కేటాయించిన తేదీల్లో సదస్సులను నిర్వహిస్తారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులకు అర్జీలను అందించి పరిష్కరించుకోవాలి. ఈ అవకాశాన్ని రైతులు, భూ యజమానులు సద్వినియోగం చేసుకోవాలి.
– అదనపు కలెక్టర్ (రెవెన్యూ), అబ్దుల్ హమీద్
20వ తేదీ వరకు నిర్వహణ
386 గ్రామాల్లో కార్యక్రమాలు
జిల్లా వివరాలు ఇలా..
మండలాలు: 25
గ్రామ పంచాయతీలు: 499
రెవెన్యూ గ్రామాలు: 386
భూ పట్టాధారులు: 3,54,739
పార్ట్ బీలో నమోదైన ఖాతాల సంఖ్య: 5,522