సంగారెడ్డి: పిల్లల్లో వ్యాధుల్ని ముందుగానే గుర్తించడం ద్వారా వాటిని నయం చేసి చిన్నారుల్ని సాధారణ స్థితికి తీసుకురావచ్చని జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి పేర్కొన్నారు. సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలోని ఆర్బీఎస్కే, డీఈఐసీ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన నవజాత శిశువు నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు రిస్క్ అసెస్మెంట్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. వసంతరావు, డా.శశాంక్లతో కలసి ఆమె ప్రారంభించారు. సంగారెడ్డి పరిసర ప్రాంతాలు, జోగిపేట, సదాశివపేట ప్రాంతాల నుంచి మొత్తం 24 మంది రిస్క్లో ఉన్న పిల్లలను డీఈఐసీ కేంద్రానికి రిఫర్ చేసి, స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా లలితకుమారి మాట్లాడుతూ.. నవజాత శిశువు నుంచి ఐదేళ్లలోపు పిల్లల్లో ఆరోగ్య సమస్యలను త్వరగా గుర్తించడం చాలా కీలకమన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్ల ద్వారా ఇంటింటా సర్వే నిర్వహించి, రిస్క్లో ఉన్న పిల్లలను గుర్తించి, వారిని ఆర్బీఎస్కే మెడికల్ అధికారుల ద్వారా స్క్రీనింగ్ చేసి అవసరమైన రిఫరల్ సేవలు, ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలు తమ పిల్లల్లో ఉన్న సమస్యలను గుర్తించకపోతే, భవిష్యత్తులో ప్రమాదాలకు గురయ్యే అవకాశముందని డీఎంహెచ్ఓ వసంతరావు పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య సేవల ద్వారా రిస్క్లో ఉన్న పిల్లలకు ఉచితంగా సర్జరీలు, ఫిజియోథెరపీ సేవలు అవసరమైన రిఫరల్ సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ శశాంక్ తెలిపారు. కార్యక్రమంలో డీసీపీఓ రత్నం, పోషణ అభియాన్ కో ఆర్డినేటర్ నవీన్ చారి, డీసీపీఎస్ సిబ్బంది లింగం, యాదగిరి, సతీష్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి


