● పెనువిషాదంలో నిరుపేద కుటుంబం
● అంత్యక్రియలకు ఆర్థికసాయం చేసిన గ్రామస్తులు
వర్గల్(గజ్వేల్): చేతికందిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నిరుపేద తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. అంత్యక్రియలకు సైతం ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు. ఈ ఘటన మండలంలోని శేరిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జిన్న నర్సింహులు దివ్యాంగుడు. ఆయనకు భార్య పుష్ప, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు అరవింద్(19) ఉన్నారు. కూలీ పనులతో కాలం వెల్లదీస్తున్నారు. ఒక కుమార్తె వివాహమైంది. పదోతరగతి దాకా చదివిన అరవింద్ చిన్నాచితక పనులతో కుటుంబానికి కాస్తా తోడుగా ఉంటున్నాడు. అతడు గురువారం ద్విచక్రవాహనంపై వర్గల్ వెళ్లి తిరిగొస్తూ గ్రామశివారులో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. తీవ్రగాయాలతో అదేరోజు రాత్రి ఆర్వీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శుక్రవారం గ్రామస్తులు చందాలు పోగేసి ఆ కుటుంబానికి ఆర్థికసాయం చేశారు. అశ్రునయనాల మధ్య అరవింద్ అంత్యక్రియలు నిర్వహించారు.
లారీ, స్కూటీ ఢీ..
కంది (సంగారెడ్డి): లారీ, స్కూటర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ ఎదురుగా చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి కథనం ప్రకారం.. పటాన్ చెరు మండలంలోని బీరంగూడ ఉస్కేబావి ప్రాంతానికి చెందిన సీతారాం రెడ్డి(65) శుక్రవారం సంగారెడ్డి నుంచి బీరంగూడకు స్కూటీపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో స్కూటీని ఐఐటీ హైదరాబాద్ ఎదురుగా జాతీయ రహదారిపై వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సీతారాంరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


