● ఇద్దరు దొంగల అరెస్టు
● భారీగా ఇనుప వస్తువులు స్వాధీనం
● వివరాలను వెల్లడించిన ఎస్ఐ ప్రశాంత్
అక్కన్నపేట(హుస్నాబాద్): వారిద్దరూ స్నేహితులు.. పైగా దొంగతనాలను అలవాటుగా మార్చుకున్నారు. మూసివేసిన క్రషర్ మిల్లులే టార్గెట్గా ఎంచుకొని కొన్నిరోజులుగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే.. పోలీసులు వారిని చాకచాక్యంగా పట్టుకున్నారు. ఈ సంఘటన అక్కన్నపేట మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ కథనం ప్రకారం... సిద్దిపేట జిల్లా, చిన్నకోడూరు మండలం, మేడిపల్లికి చెందిన నూనె సాయికిరణ్, నెల్లూట్ల శేఖర్ స్నేహితులు. కొంతకాలంగా చిన్నకోడూరు, హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలల్లో మూసివేసిన క్రషర్ మిల్లుల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. కట్కూర్, పరికిబండలతో పాటు తదితర ప్రాంతాల్లో ఉన్న క్రషర్ మిల్లుల్లో భారీ ఇనుప వస్తువులు, మోటార్లు, హౌసింగ్ సామగ్రిని, ఎలక్ట్రిక్ కేబుల్ వైర్లు దొంగిలించినట్లు నిందితులు ఒప్పుకున్నారన్నారు. దీంతో నిందితుల వద్ద ఉన్న ఇనుప వస్తువులను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. సమావేశంలో కానిస్టేబుళ్లు రాజ్కుమార్, రమేష్ పాల్గొన్నారు.


