మెదక్ కలెక్టరేట్: యువత సాధికారతకు కేరీర్ గైడెన్స్ ఎంతోగానో దోహద పడతాయని, టెన్త్, ఇంటర్ తర్వాత ఉన్నత చదువులకు సరైన స్ట్రీమ్ ఎంపిక చేసుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయంలో కెరీర్ గైడెన్స్పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత కెరీర్ తాను ఎంచుకున్న రంగంలో నాణ్యమైన గుణాత్మక విద్య ద్వారా ఉన్నత శిఖరాల అధిరోహించాలన్నారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఓటమి వచ్చినప్పుడు అధైర్య పడవద్దన్నారు. ప్రతి ఒక్కరూ మరలా కష్టపడి చదివి యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు కలెక్టరేట్లో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కార్మిక సంఘాలు కృషి చేయాలన్నారు. ప్రతి కార్మికుడికి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, కార్మిక శాఖ సహాయ కమిషనర్ సాహితి పాల్గొన్నారు.


