హత్నూర(సంగారెడ్డి): ఉపాధి హామీ పథకం కూలీలకు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు సర్పంచ్ ఎల్లయ్య తెలిపారు. శుక్రవారం హత్నూరలో ఉపాధి హామీ కూలీలకు తాగడానికి కూల్ వాటర్ అందజేసి అండగా నిలిచారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నీటి సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మజార్ అలీ, ఉపసర్పంచ్ చెక్క మానస రవీందర్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ మేరాజ్, ఫీల్డ్ అసిస్టెంట్ రవీందర్ గౌడ్, నాయకులు రవీందర్ గౌడ్, మన్నె యాదగిరి, బాలు చంద్రయ్య, దశరథ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా బుద్ధ జయంతి
నారాయణఖేడ్: మండంలోని అంబేద్కర్ భవన్లో శుక్రవారం గౌతమబుద్ధుడి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ బుద్ధుడి చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం గౌతమ బుద్ధుడి సందేశాలు, ఆలోచనలు ప్రపంచానికి మార్గదర్శకాలని కొనియాడారు. ప్రతీ ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు అనుముల తుకారాం, ప్రశాంత్, కాశయ్య, సిద్దు తదితరులు పాల్గొన్నారు.
హెల్మెట్ల పంపిణీ
మునిపల్లి(అందోల్): మండలంలోని బుదేరా లో నూతన వధూవరులకు శుక్రవారం అల్లాపూర్ సర్పంచ్ నారాయణ హెల్మెట్లు అందజేశారు. బైక్ నడిపే సమయంలో తప్పకుండా హెల్మెట్ ఉపయోగించాలన్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో బుదేరా సర్పంచ్ మల్లేశం, ఉపసర్పంచ్ సయ్యద్ ఇస్మాయిల్, బస్వరాజ్ స్వామి, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
సినీనటి నిధి అగర్వాల్ సందడి
జహీరాబాద్: ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ సందడి చేశారు. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అభిమానులకు అభివాదం చేస్తూ ఉత్సాహ పరిచారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు మహిళలు పోటీ పడ్డారు. సినీ డైరెక్టర్ హరీష్ శంకర్, ఎమ్మెల్యే మాణిక్రావు, మున్సిపల్ చైర్మన్ యూనూస్, వైస్ చైర్మన్ శిరీషారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తంతో పాటు సర్దార్బాష, సుదీష్ణ, వినీల పాల్గొన్నారు.
ఉపాధి కూలీలకు
సమాన వేతనాలు
మునిపల్లి(అందోల్): ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు సమానంగా వేతనాలు చెల్లిస్తున్నట్లు తాటిపల్లి ఫిల్డ్ అసిస్టెంట్ ఏసయ్య తెలిపారు. శుక్రవారం మండలంలోని తాటిపల్లిలో ఉపాధి హామీ పథకంలో కూలీలు పనులు నిర్వహించుకుని మేడే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం కాల్వల మళ్లింపు పనులను కూలీలు నిర్వహించారు. కూలీలు చేసిన పనులకు టెక్నికల్ అసిస్టెంట్ సంతోష్ సమయానికి కొలతలు కొలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూలీలు మల్లేశం, నర్సింలు, మల్లయ్య, మధు, రత్నయ్యతో పాటు కూలీలు పాల్గొన్నారు.
బాల్య వివాహాల నిర్మూలన
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని చందంపేట గ్రామసభలో బాల్య వివాహాల నిర్మూలనకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సర్పంచ్ ప్రవీణ్కుమాక్ అధ్యక్షతన నిర్వహించిన బాల్య వివాహాల నిర్మూలన సభలో పాలక వర్గం సభ్యులు, గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇక ముందు గ్రామంలో బాల్య వివాహాలు చేయకుండా అందరూ సహకరించాలని కోరారు. బాలికలు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్ల తర్వాతనే పెళ్లిళ్లు జరిగేలా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.


