సంగారెడ్డి: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి అరబిందో ఫార్మా లిమిటెడ్ కంపెనీ మరోసారి ముందుకొచ్చింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వినతి మేరకు గతంలో రూ.6 కోట్లతో 1000 మంది విద్యార్థులకు సరిపడా నూతన భవనం ఏర్పాటు చేయగా.. మరో వెయ్యి మందికి సరిపడా అదనపు తరగతి గదులు కావాలని అరబిందో చైర్మన్ నిత్యానందరెడ్డిని జగ్గారెడ్డి కోరారు. ఇందుకు గాను మరో 17 అదనపు తరగతి గదులు, ఆడిటోరియం షేడ్ నిర్మాణానికి ఆయన ముందుకొచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం జగ్గారెడ్డి, నిర్మలతో కలిసి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను అరబిందో డైరెక్టర్ సందర్శించారు. అనంతరం కళాశాల అధికారులతో సమావేశం నిర్వహించారు. కంపెనీ నిధులతో కళాశాల పనులు త్వరలో ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, నాయకులు, సంతోష్, కిరణ్ గౌడ్, కౌన్సిలర్లు మహేష్, శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.


