కొండాపూర్(సంగారెడ్డి): గ్రామాల్లో జరిగే సామూహిక ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యతను పెంచుతాయని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని మల్కాపూర్లో పార్వతీ మరకత రాజరాజేశ్వర స్వామి దివ్య ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ధ్వజస్తంభం, బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయాలు సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలని, ఇలాంటి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేకు ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ పవన్, శ్రీధర్ రెడ్డి, దేవేందర్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్


