ఆలయం చుట్టూ
చలువ
పందిళ్లు
ఎల్లమ్మ జాతరకు
నేటి నుంచే రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు
● నెల రోజుల పాటు హుస్నాబాద్లో భక్తుల సందడే
● భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న అమ్మవారు
● పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి పొన్నం
హుస్నాబాద్: పట్టణంలో నిర్మించిన రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. భక్తుల కొంగుబంగారంగా ఎల్లమ్మ తల్లి విరాజిల్లుతోంది. మే ఒకటన జాతర ప్రారంభమై నెలంతా కొనసాగుతుంది. ఇందుకు నిర్వాహకులు అన్ని ఏరాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోనే అతి పెద్ద ఎల్లమ్మ తల్లి విగ్రహంగా ప్రాచుర్యం పొందింది. రేణు అంటే సంస్కృతంలో ఇసుక అని అర్థం. అమ్మవారు జమదగ్ని ఆజ్ఞతో రోజు ఇసుకతో తయారు చేసిన కుండతో నీళ్లను తీసుకువెళ్తుతుండేది. అందుకే అమ్మవారిని రేణుకా దేవిగా చెబుతుంటారు. ఎల్లమ్మ అంటే ఎల్లరకు (అందరికీ) అమ్మగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. కాకతీయుల కాలంలో రాణి రుద్రమ దేవి పర్యవేక్షణలో ఎల్లమ్మ దేవాలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతుంది. ఈ కాలంలోనే నిర్మించిన చెరువుకు ఎల్లమ్మ చెరువుగా నామకరణం చేశారు. అంతటి ప్రాచుర్యం పొందిన ఎల్లమ్మ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతోంది. రేణుకా ఎల్లమ్మ జాతర వైశాఖ పౌర్ణమి మే 1 నుంచి జేష్ట్య పౌర్ణమి 31వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనుంది.
వేలాదిగా తరలిరానున్న భక్తులు..
ఎల్లమ్మ జాతరలో బోనాలు, పట్నాలు, ఎండ్ల బండ్ల ఊరేగింపు ప్రత్యేకం. నెల రోజుల పాటు జాతర వైభవంగా జరగనుంది. జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. శుక్రవారం వైశాఖ ఘటంతో ఆలయ ప్రవేశం నిర్వహిస్తారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, దృష్టి కుంభం, శ్రీ రేణుకా ఎల్లమ్మ, జమదగ్ని మునిరాజు కల్యాణం (సిద్దోగం)చేపడతారు. జాతర సందర్భంగా స్వీట్లు, గాజులు, చీరలు, పూజా సామగ్రి, ఆట బొమ్మలు ఇలా పలు దుకాణాలు వెలిశాయి.
రేణుకా ఎల్లమ్మ జాతరను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించారు. ఆలయం చుట్టూ చలువ పందిళ్లు, తాగునీరు వసతి, క్యూలెన్లు ఏర్పాటు చేశారు. ఆలయంతో పాటు ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. జాతర సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.


