17,385 సంఘాల ఏర్పాటే లక్ష్యం..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మహిళా సాధికారత దిశగా గ్రామీణాభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక మహిళా సంఘాల (ఎస్హెచ్జీ గ్రూపుల) మాదిరిగానే గ్రామాల్లో కిశోర బాలికల కోసం కూడా సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్నేహ సంఘాల పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ సంఘాల్లో 15– 18 సంవత్సరాల మధ్య ఉన్న బాలికలు సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతానికి ఒక్కో గ్రామంలో ఒక్కో గ్రూపు చొప్పున ఈ సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్హెచ్జీ గ్రూపుల్లో 18–60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలే సభ్యులుగా ఉంటారు. 15 సంవత్సరాల నుంచి 18 ఏళ్లలోపు ఉన్న వారు సంఘాలు ఏర్పాటు చేయడం ద్వారా వారిలో రానున్న రోజుల్లో మహిళా సాధికారత వైపు సంఘటితం అయ్యేందుకు మార్గం సుగమమం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
13 రోజుల కేలండర్..
ఈ స్నేహ సంఘాల్లో సభ్యులుగా ఉండే ఏజ్ గ్రూప్ బాలికలు టెన్త్ నుంచి ఇంటర్.. డిగ్రీ, బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న వారే ఎక్కువగా ఉంటారు. వీరికి వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక కేలండర్ రూపొందించారు. శుక్రవారం నుంచే ఈ కార్యక్రమాలను ప్రారంభం కానున్నాయి. సైబర్ క్రైం, స్మార్ట్ఫోన్ వినియోగం, డ్రగ్స్ వంటి అంశాలపై సంబంధిత నిపుణులతో అవగాహన కల్పిస్తారు. సైకిల్ తొక్కడం, బాల్య వివాహాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, రక్తహీనత, కిశోర బాలికల ఆరోగ్య సమస్యలు, బాలికలకు సమాజంలో ఎదురయ్యే సవాళ్లు, భద్రత, తల్లిదండ్రులకు కృతజ్ఞత, బాలికలతో గ్రామసభల నిర్వహణ వంటి కార్యాక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
పైలెట్ ప్రాజెక్టుగా గ్రామానికో సంఘం ఏర్పాటు
15–18 ఏళ్ల బాలికలే సభ్యులు
నేటి నుంచి 13 అంశాలపై అవగాహన కార్యక్రమాలు
రాష్ట్రంలో ఇందిరా క్రాంతిపథం (ఐకేపీ) ఆధ్వర్యంలో ప్రస్తుతం 17,385 గ్రామ సంఘాలు ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో గ్రామానికి ఒక్కో స్నేహ సంఘం చొప్పున 17,385 స్నేహ సంఘాలను ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 8,940 సంఘాలను ఏర్పాటు చేశారు. మిగిలిన సంఘాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఐకేపీ అధికారులు, సిబ్బందిని ఆదేశించింది.


