వట్పల్లి(అందోల్): ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అందోల్ మండల పరిధిలోని డాకూర్లో గురువారం ధర్మశాస్త్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సహారా ఆస్పత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు క్యాన్సర్, డయాలసిస్, గుండె సంబంధ చికిత్సలను ఉచితంగా అందిస్తున్నామన్నారు. డాకూర్ గ్రామ ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడానికి ఈ ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు వైద్య చికిత్సల కోసం దగ్గర్లో ఉన్న జోగిపేట ప్రభుత్వాస్పత్రి, సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వైద్య చికిత్సలు ఉచితంగా అందిస్తున్నామని ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందోల్ను హెల్త్ హబ్గా అభివృద్ధి తీర్చిదిద్దుతున్నామని దీనిలో భాగంగానే అందోల్ శివారులో 150 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంపులో పాల్గొన్న సహారా ఆస్పత్రి వైద్యలు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందించారు. కార్యక్రమంలో సంగారెడ్డి డీఎంహెచ్ఓ వసంత్ కుమార్, డాకూరు గ్రామ సర్పంచ్ వసంత్రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ నరేందర్రెడ్డి, లయన్స్క్లబ్ అధ్యక్షుడు మధుసూధన్రెడ్డి, మాజీ ఎంపీటీసీ రమేశ్గౌడ్తోపాటు ప్రజలు పాల్గొన్నారు.
ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు
మునిపల్లి(అందోల్): ఉపాధి హామీ పథకం నిధులతో ప్రతీ గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు. మండలంలోని గార్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యుల వివాహనికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను తాజా మాజీ ప్రజా ప్రతినిధులతో మాట్లాడి తెలుసుకున్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ
డాకూర్లో ఆరోగ్య శిబిరం ప్రారంభం


