సిద్దిపేటజోన్: పోలీసు విభాగం అత్యంత క్రమశిక్షణకు మారుపేరని, అలాంటి గౌరవప్రదమైన బాధ్యతల్లో ఉన్న మనం ఐక్యంగా పనిచేయాలని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ పిలుపునిచ్చారు. బుధవారం పోలీసు కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన లింగ వివక్ష – అవగాహన అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన సీపీ మాట్లాడుతూ... విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ పాటించాలన్నారు. పనిచేసే ప్రాంతాల్లో మహిళా సిబ్బందిపై వేధింపులు సహించబోమని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధి నిర్వహణలో ఒకరిపైఒకరు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రజలతో, తోటి సిబ్బందితో ఎలా ప్రవర్తించాలో ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలన్నారు. పోలీసు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహిళ భద్రత, రక్షణకు సంబంధించిన పలు అవగాహన వీడియోలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుషాల్కర్, అదనపు డీసీపీ సుభాష్, ఏసీపీ రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ దుర్గ, న్యాయవాది రియాజోద్దీన్, సీఐలు, ఎస్సైలు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.
సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్


