రాష్ట్ర స్థాయి పోటీలకు మూడు ప్రాజెక్టులు ఎంపిక
దుబ్బాక: జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టులో దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సత్తా చాటింది. కళాశాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు మరోసారి రాష్ట్రస్థాయి పోటీలకు మూడు విభాగాల నుంచి ఎంపికయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు సమర్పించిన 1431 అధ్యయన ప్రాజెక్టులలో 309 రాష్ట్రస్థాయి ప్రజెంటేషన్కు ఎంపికయ్యాయి. ఇందులో దుబ్బాక కళాశాల నుంచి 5 ప్రాజెక్టులు సమర్పించగా.. 3 రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయని ప్రిన్సిపాల్ భవాని తెలిపారు. రసాయన శాస్త్రం విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్యాంసుందర్ పర్యవేక్షణలో రూపొందించిన వ్యవసాయ వ్యర్థాలను వినియోగించి తక్కువ ఖర్చుతో నీటిశుద్ధి, తెలుగు విభాగం ఉపన్యాసకులు వెంకటేశ్ పర్యవేక్షణలో రూపొందించిన కుల వృత్తులు, తెలంగాణ వాడుక పదాల ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఉపన్యాసకులు ఆంజనేయులు పర్యవేక్షణలో రూపొందించిన యూరియా పంపిణీలో యాప్ పనితీరు విధానంపై సాంకేతిక పరిష్కారాలను ప్రతిపాదించిన ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను,అధ్యాపకులను ప్రత్యేకంగా అభినందించారు.
నర్సాపూర్ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు..
నర్సాపూర్ రూరల్: రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీల్లో నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన రెండు ప్రాజెక్టులకు గుర్తింపు లభించిందని ప్రిన్సిపాల్ డాక్టర్ హుస్సేన్ తెలిపారు. జంతుశాస్త్రం విభాగం అధ్యాపకుడు డాక్టర్ సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు పక్షుల వైవిధ్యంపై చేపట్టిన పరిశోధన ప్రాజెక్టు, భౌతికశాస్త్రం విభా గం అధ్యాపకుడు రవి ఆధ్వర్యంలో విద్యార్థులు విద్యుత్ వినియోగంపై చేపట్టిన ప్రాజెక్టులకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. కాగా విద్యార్థులు, అధ్యాపకులను ప్రిన్సిపాల్ అభినందించారు.


