సంగారెడ్డి టౌన్: ఈత కొడుతూ నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి వివరాల ప్రకారం... కల్పగూరు గ్రామ పరిధిలోని మంజీరా డ్యాంలో ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన గొల్లంకి గణేశ్ (25) ఈనెల 26న సాయంత్రం తన స్నేహితులతో కలిసి వచ్చాడు. సాయంత్రం డ్యాంలోని నీటిలో దిగి ఈత కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈత సరిగా రాకపోవడంతో నీటిలో కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటికి తీయించారు. అయితే మృతి చెందిన యువకుడు ఇస్నాపూర్ పరిధిలోని సెన్సాకోర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇక్కడే ఉంటున్నాడు.
స్నానానికి వెళ్లిన యువకుడు..
చేగుంట(తూప్రాన్): ప్రమాదవశాత్తు యువకుడు నీట మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని చిట్టోజిసల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చాకలి రమేశ్ తన బంధువులతో కలిసి గ్రామంలోని శ్యామల వ్యవసాయ పొలంలోని నీటి స్టోరేజీ గుంతలో స్నానం చేసేందుకు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు రమేశ్ నీటిలో మునిగి మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి పంచనామా నిర్వహించారు. మృతుడి తల్లి నర్సవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


