ముగిసిన రాజీనామాల వివాదం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రాజీనామాల వివాదం

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

గుమ్మడిదల బల్దియాలో కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ నేతల మధ్య వాగ్బాణాలు చిమ్ముల సవాల్‌తో రాజీనామాకు సిద్ధమైన కాంగ్రెస్‌నేత నరేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ సవాల్‌ను స్వీకరించని మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ సంధ్య

జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీలో నాలుగు రోజులుగా సాగుతున్న బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ నేతల మధ్య రాజీనామాల పర్వానికి తెరపడింది. ఇటీవల మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్‌ నేత చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్‌పై విమర్శలు చేయగా..గోవర్ధన్‌రెడ్డి రాజకీయ ముసుగులో అక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ నరేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గోవర్ధన్‌రెడ్డి మండిపడుతూ అసత్య ప్రచారాలు చేయడం సరికాదని ధైర్యముంటే తన కౌన్సిలర్‌ పదవికి రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు. ఆ స్థానంలో తమ కార్యకర్తలను బరిలోకి దింపి గెలిపిస్తామన్నారు. గోవర్ధన్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తూ నరేందర్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమయ్యారు. కాగా గోవర్ధన్‌రెడ్డి సతీమణి మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ సంధ్య కూడా ఆమె పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. అయితే నరేందర్‌రెడ్డి తన రాజీనామాపత్రంతో మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. వైస్‌చైర్‌ పర్సన్‌ సంధ్య రాజీనామాకు సిద్ధం కాకపోవడంతో నరేందర్‌రెడ్డి పంతం నెగ్గినట్లైనది. అనంతరం ఈ వ్యవహారంపై కౌన్సిలర్‌ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ...బీఆర్‌ఎస్‌ నాయకులు సవాలు విసిరినా ముందుకు రాకపోవడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా స్థాయిని మరిచి కాంగ్రెస్‌ నేతలపై విమర్శలు తగవని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలో ప్రజల ఓట్లతో గెలవలేని వ్యక్తి తాను ఎమ్మెల్యేనని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్‌ నాయకులపై విమర్శలు మానుకుని అభివృద్ధికి కలిసి రావాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పుట్ట నర్సింగరావు, వడ్డే కృష్ణ, ఆత్మ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గోవర్ధన్‌గౌడ్‌, నాయకులు పాల్గొన్నారు.

అనవసర విషయాల్లోకి లాగొద్దు: చైర్‌పర్సన్‌ సంధ్య

రెండు రోజులుగా మున్సిపాలిటీలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలపై మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సంధ్య స్పందించారు. పరస్పర సవాళ్లు రాజకీయంగానే చేస్తే మంచిదని అందులోకి మహిళా ప్రజాప్రతినిధులను లాగొద్దని సూచించారు. రాజీనామా విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని మున్సిపల్‌ అభివృద్ధిలో సమిష్టి కృషితో ముందుకెళ్లడమే తన ముందున్న లక్ష్యం అని పేర్కొన్నారు. నాయకుల మధ్య వాడీవేడి చర్చలు రాజకీయ పరంగానే ఉండాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement