● ఇబ్బంది పడుతున్న వాహనదారులు ● వరికోత మెషీన్లకు డీజిల్ కొరత
హత్నూర (సంగారెడ్డి)/సంగారెడ్డి క్రైమ్: డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందుల గురవుతున్నారు. వరికోతలు ప్రారంభం కావడంతో వరి కోత యంత్రాలకు డీజిల్ కొరత ఏర్పడింది. హత్నూర పెట్రోల్ బంకులో వివిధ గ్రామాలకు చెందిన రైతులు వాహనదారులు సోమవారం డబ్బాలను డీజిల్ కోసంలో పెట్రోల్ బంకుల వద్ద క్యూలో పెట్టారు. ప్రస్తుతం దౌల్తాబాద్, మల్కాపూర్, మెదక్ జిల్లా నర్సాపూర్, తదితర పట్టణాల గ్రామాలలోని పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత ఏర్పడటం వల్ల ఒక్కసారిగా హత్నూరలోని పెట్రోల్ బంకుకు వాహనదారులు క్యూ కట్టారు. ప్రస్తుతం గ్రామాల్లో వరికోతలు జోరుగా ఉండటంతో ప్యాడీ హార్వెస్టర్లకు పెద్ద ఎత్తున డీజిల్ అవసరం పడుతోంది. అయితే డీజిల్ కొరత ఏర్పడటంతో వరికోత యంత్రాల యజమానులు ఆందోళన చెందుతు న్నారు. డీజిల్ దొరకకుంటే వరికోతలు ఆగిపోతాయని రైతులు వాపోతున్నారు. ఆటోవాలాలు సైతం డీజిల్ కొరతతో వాటిని ఇంటిపట్టునే ఉంచాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు డీజిల్ కొరత లేకుండా చూడాలని పలు గ్రామాల రైతుల కోరుతున్నారు.
సంగారెడ్డిలో పెట్రోల్ కోసం బారులు
పట్టణంలో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి పట్టణంతోపాటు చుట్టుప్రక్కల గ్రామాలైన కంది, మల్కాపూర్, పెద్దపల్లి, తదితర పట్టణాల, గ్రామాల్లోని పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత ఏర్పడటంతో ఒక్కసారిగా పెట్రోల్ బంకుకు వాహనదారులు బారులు కట్టారు.


