● కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కార్యవర్గాలు ఏర్పాటు చేయాలన్నారు. గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల క్రియాశీలక నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలువురు నాయకులతో మీనాక్షి నటరాజన్ వన్ టూ వన్గా సమావేశమయ్యారు. పార్టీలో అంతర్గతంగా కొనసాగుతున్న విషయాలను అడిగినట్లు తెలిసింది. అనంతరం మీనాక్షి మాట్లాడుతూ...బూత్, గ్రామ, మండల, బ్లాక్ జిల్లా కాంగ్రెస్ కమిటీల్లో మూడేళ్లు పూర్తయిన ప్రతీ ఒక్కరిని మార్చాలన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు, నాయకులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఆయా కార్యవర్గాలను ఎన్నుకుని వివరాలను పీసీసీకి పంపాలని పేర్కొన్నారు.


