సంగారెడ్డి క్రైమ్: ఆర్థిక ఇబ్బందులతో మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ రామునాయుడు వివరాల ప్రకారం... అందోల్ మండలం గంగోజీపేట గ్రామానికి చెందిన కుమ్మరి భాగ్యమ్మ (52), భర్త సత్యనారాయణతో కలిసి కొన్నేళ్లుగా పట్టణంలోని నలందనగర్లో కుండలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అత్తా, కోడలు మధ్య గొడవలు జరిగాయి. క్షణికావేశంలో ఆదివారం రాత్రి మనస్తాపం చెందిన భాగ్యమ్మ ఇంట్లో చున్నీతో ఉరేసుకుంది. వెంటనే గమనించిన కుటుంబీకులు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
డబ్బులు ఇవ్వకపోవడంతో
డోజర్ ఓనర్..
చిన్నశంకరంపేట(మెదక్): వెంచర్లో డోజర్ ఓనర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నార్సింగి పోలీసుల వివరాల మేరకు... మాసాయిపేట మండలం రామాంతపూర్ తండాకు చెందిన లకావత్ రాజు(30) వెంచర్లో డోజర్ వర్క్ చేశాడు. రెండేళ్లుగా డబ్బుల కోసం తిరుగుతున్నా రేపుమాపు అంటూ తిప్పుతున్నారు. సోమవారం కూడా డబ్బుల కోసం రాగా సరైన సమాధానం రాకపోవడంతో మనస్తాపంతో వెంచర్లోనే చెట్టుకు ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంచర్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి సముదాయించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


