హత్నూర (సంగారెడ్డి): రెండు గ్రామాల మధ్య కూరగాయల సంత తైబజార్ వేలం చిచ్చు రేపింది. ఈ సంఘటన సోమవారం మండలంలోని కాసాల – దౌల్తాబాద్ గ్రామాల మధ్య చోటు చేసుకుంది. దౌల్తాబాద్ గ్రామానికి సంబంధించి తైబజార్ వేలంను నూతనంగా దక్కించుకున్న వారు సంతలో తైబజార్ వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాసాల గ్రామస్తులు అడ్డు తగలడంతో రెండు గ్రామాల ప్రజల మధ్య వివాదం జరిగింది. దౌల్తాబాద్ గ్రామ శివారు దాటి కాసాల గ్రామ రెవెన్యూ పరిధిలో తైబజార్ వసూలు చేయకూడదని కాసాల గ్రామస్తులు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా కాసాల గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా ఇరు గ్రామాల మధ్య తైబజార్ సమస్య రగులుతుందని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. అలాగే దౌల్తాబాద్ ప్రజా ప్రతినిధులు, స్థానికులు మాట్లాడుతూ.. కొన్నేళ్ల నుంచి తైబజార్ వేలం వసూలు చేస్తున్నామని, కావాలనే కాసాల గ్రామస్తులు అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
వాగ్వాదానికి దారి తీసిన తైబజార్


