● అధ్వానంగా జహీరాబాద్–బీదర్ రోడ్డు ● తరచూ ప్రమాదాలు.. గుబులు పుట్టిస్తున్న ప్రయాణం ● పట్టించుకోని అధికారులు
జహీరాబాద్–బీదర్ రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. రద్దీగా ఉండే రహదారి ఇరుకుగా ఉండటంతోపాటు అడుగడునా గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. తరచూ ప్రమాదాలు చోటు చేసుకుని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కర్ణాటక రాష్ట్ర పరిధిలోకి వచ్చే రోడ్డును అక్కడి ప్రభుత్వం మరమ్మతులు చేపట్టి వేగ నిరోధకాలు, ప్రమాద సూచికలను, రేడియం బోర్డులను ఏర్పాటు చేయగా ఇక్కడ ప్రభుత్వం మాత్రం విస్తరణపనులు చేపట్టటం అటుంచి కనీసం మరమ్మతు పనులైనా చేపట్టలేదు.
– జహీరాబాద్ టౌన్:
పట్టణం సమీపంలో గల చౌరస్తా నుంచి కర్ణాటకలోని బీదర్ పట్టణం వరకు సుమారు 32 కిలోమీటర్ల పొడువునా జహీరాబాద్–బీదర్ రహదారి సాగుతుంది. రాష్ట్ర సరిహద్దు వరకు గల 19 కిలోమీటర్ల రోడ్డు తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి రాగా సుమారు 13 కి.మీ కర్ణాటకలోని బీదర్ పరిధిలోకి వస్తుంది. చౌరస్తా నుంచి కర్ణాటక సరిహద్దు వరకు గల తెలంగాణలోని రోడ్డు పూర్తిగా దెబ్బతింది. గతేడాది నుంచి రోడ్డు ప్రమాదాల వల్ల కనీసం 10 మంది మృత్యువాత పడగా 25 మందికి గాయాలయ్యాయి.
ఆర్అండ్బీ పరిధిలో ఉన్న రోడ్డును నేషనల్ హైవే అథారిటీకి బదలాయించిన తర్వాత రెండు శాఖల అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. దెబ్బతిన్న రోడ్డుకు కనీసం మరమ్మతులు కూడా చేయడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలోనే ఈ రోడ్డును ఎన్హెచ్ఏ వారికి బదలాయించామని, రోడ్డు మరమ్మతుల గురించి వారే చూసుకోవాలని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. ఎన్హెచ్ఏ అఽధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడకపోతుండటంతో వాహనదారులు నరకం చూస్తున్నారు.
నేషనల్ హైవే అథారిటీకి బదలాయింపు
జహీరాబాద్–బీదర్ రోడ్డు ఇరుకుగా ఉండి వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. రోడ్డు మధ్యలో వంతెనలు, రైల్వే గేటు కూడా ఉండటం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. తెలంగాణ. కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ ఉన్న రోడ్డులో నిత్యం ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకుని జాతీయ రహదారిగా గుర్తించి ఫోర్లైన్గా విస్తరించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ప్రతిపాదనలు పంపగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. వెంటనే ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోని ఈ రోడ్డును నేషనల్ హైవే అథారిటీకి బదలాయించారు. ఏళ్లు గడుస్తున్నా రోడ్డును జాతీయ రహదారిగా అప్గ్రేడ్ చేయకపోవడంతో విస్తీర్ణం పనుల్లో జాప్యం జరుగుతోంది.


