నారాయణఖేడ్: ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు లబ్ధిదారులకు సకాలంలో అందేలా చూడాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి గృహనిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు. ఖేడ్లోని క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ డీఈఈ, డివిజన్ పరిధిలోని ఏఈలతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా మంజూరైన ఇళ్లు, పూర్తయిన, వివిధస్థాయిల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు, బిల్లుల చెల్లింపు వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. నిర్మాణంలో ఉన్నవాటిని పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక సలహాలను అందిస్తూ త్వరగా పూర్తిచేసుకునేలా చూడాలన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమెల్యే ఆదేశించారు.
వైభవంగా జాతర ఉత్సవాలు
ఖేడ్ మండలం తుర్కాపల్లి గ్రామంలో భూలక్ష్మమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆకుల లింగాపూర్ గ్రామంలో శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం నిర్వహించారు. జాతర, కల్యాణోత్సవాల్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నగేశ్ షెట్కార్ తదితరులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.


