● అదనపు కలెక్టర్ పాండు ● పట్టణంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ
సంగారెడ్డి: మలేరియాను పూర్తిగా అరికట్టాలని అదనపు కలెక్టర్ పాండు సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శనివారం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నర్సింగ్, పారామెడికల్ కళాశాల విద్యార్థులతో పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాండు హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ... మలేరియా వ్యాధి బారినపడి చాలామంది అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ఆ వ్యాధి పట్ల ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలన్నారు. వర్షాకాలం ప్రారంభం నుంచే పరిసరాల పరిశుభ్రత నీటి నిల్వలు ఉండకుండా చూడటం, ప్రతీ శుక్రవారం డ్రైడే పాటించడం ప్రతీ ఒక్కరి బాధ్యతని చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వసంతరావు, జిల్లా ఇన్చార్జి మలేరియా అధికారి ప్రవీణ్, జిల్లా ఆరోగ్య విద్యాధికారి శ్రీనివాసరావు, హెల్త్ ఎడ్యుకేటర్ మంగమ్మ, ఆరోగ్య విస్తరణాధికారి వీరేశం ఇతర వైద్య సిబ్బంది, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.


