● రూ.200 కోట్లతో అదనపు పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి
● మున్సిపల్, పబ్లిక్హెల్త్, మిషన్ భగీరథ అధికారులతో సమీక్షలో
జగ్గారెడ్డి, నిర్మల
సంగారెడ్డి: పట్టణ ప్రజలకు ప్రతీరోజు రెండు గంటలపాటు స్వచ్ఛమైన మంచినీళ్లు అందించేందుకు రూ.200 కోట్లతో మంజీరా వాటర్ స్కీమ్ అదనపు పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల పేర్కొన్నారు. సంగారెడ్డికి మంజీరా నీటి సరఫరాపై మున్సిపల్, పబ్లిక్హెల్త్, మిషన్ భగీరథ అధికారులతో శనివారం సంగారెడ్డిలో వీరు సమీక్ష నిర్వహించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సంగారెడ్డిలో రూ.230 కోట్లతో మంజీరా వాటర్ స్కీమ్ ఏర్పాటు చేయించానన్నారు. నాలుగు దిక్కులా పైపులైన్లు, ట్యాంకులు, నల్లాల కనెక్షన్లు నిర్మించడానికి నాలుగేళ్ల సమయం పట్టిందన్నారు. మంజీరాలో ఇప్పుడున్న ఇంటెక్వెల్ స్థానంలో మరింత లోపలికి ఏర్పాటు చేసి అదనంగా టాంకుల నిర్మించాలని సూచించారు. ప్రస్తుత ప్రాజెక్ట్ వ్యయం రూ.175 కోట్లతో కొత్త ప్రతిపాదన, మంజీరా డ్యామ్ వద్ద అదనంగా రూ.25 కోట్లతో మరొక ఇంటెక్వెల్ కలిపి మొత్తం రూ.200 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. దీనికి జగ్గారెడ్డి స్పందిస్తూ..పనుల మంజూరు, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని 2027లో పనులు ప్రారంభించి 2028 నాటికి పనులు పూర్తయితే సీఎం రేవంత్రెడ్డితో ప్రారంభించే యోచనలో ఉన్నామన్నారు. వచ్చే నెలలో సీఎం సంగారెడ్డికి వస్తున్న నేపథ్యంలో 5 వతేదీ కల్లా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.


