సిద్దిపేటఎడ్యుకేషన్: యువత మేలుకొని రాజ్యాంగంలో పొందుపర్చిన విధివిధానాలపై అవగాహన పెంపొందించుకొని గ్రామాలను ఏలుకోవాలని రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ హరిబాబు పేర్కొన్నారు. శుక్రవారం పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సంస్థల ఎన్నికలు, నిర్వహణపై సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ.. దేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా స్వతంత్ర ప్రతిపత్తి కల్పించినట్లు చెప్పారు. ఎన్నికల విధానాలు, రిజర్వేషన్లు, సభలు, సమావేశాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చరిత్ర విభాగాధిపతి డాక్టర్ శ్రద్ధానందం, అధ్యాపకులు సుమలత, కొండల్రెడ్డి, మహేందర్రావు, రఘుపతి, గణేశ్, పద్మ పాల్గొన్నారు.


