ఐదింట్లో గులాబీ జెండా!
పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేసి కేసీఆర్కు బహుమతిగా అందిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో..నియోజకవర్గం పరిధిలోని ఇంద్రేశం, ఇస్నాపూర్, గడ్డపోతారం, జిన్నారం, గుమ్మడిదల మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన కౌన్సిలర్ అభ్యర్థులు, సీనియర్ నాయకులు, కౌంటింగ్ ఏజెంట్లతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కౌంటింగ్ జరిగే సమయంలో ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అధిష్టానం సూచనలకు అనుగుణంగా గెలిచిన అభ్యర్థులందరూ ప్రత్యేకంగా క్యాంపులకు చేరుకోవాలని కోరారు. బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న ఐదురోజుల ఉత్సవాలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న నూతన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బీఆర్టీయూ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని ఐలా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి


