
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
టేక్మాల్(మెదక్): అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. వివరాలు ఇలా... పుల్కల్ మండలం గొంగ్లూర్ గ్రామానికి చెందిన ఇర్ఫాన్ టాటాఏస్ వాహనంలో 75సంచుల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నాడు. ఈ క్రమంలో సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్ వైపు వెళుతున్న ఆటోను బొడ్మట్పల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఆటోలో సుమారు 30క్విటాళ్ల బియ్యం ఉన్నాయి. వాహనాన్ని సీజ్ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు ఎస్ఐ రాజేశ్ తెలిపారు. జిల్లా సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ నర్సింలు, ఆర్ఐ సాయిశ్రీకాంత్ పాపన్నపేట గోదాంకు తరలించినట్లు పేర్కొన్నారు.
షార్ట్ సర్క్యూట్తో
వస్త్ర దుకాణం దగ్ధం
నర్సాపూర్ : వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్ఐ లింగం వివరాల ప్రకారం... నర్సాపూర్ చౌరస్తా సమీపంలోని శ్రీ సాయినాథ్ కలెక్షన్ దుకాణంలో సోమవారం తెల్లవారు జామున షార్ట్ సర్క్యూట్తో నిప్పంటుకుని పొగ వచ్చింది. గమనించిన భవన యజమాని శ్రీనివాస్గౌడ్ షాపు నిర్వాహకుడు సురేశ్నాథ్కు సమాచారం ఇచ్చాడు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. కాగా అగ్ని ప్రమాదంలో సుమారు రెండు లక్షల విలువ చేసే వస్త్రాలు కాలిపోయాయని బాధితుడు తెలిపాడు.
గూగుల్ మ్యాప్ను నమ్ముకుని వెళ్తే..
కుంటకట్టపైకి దారి చూపిన వైనం
చేగుంట(తూప్రాన్): పరిశ్రమకు వెళ్లాల్సిన డీసీఎంను డ్రైవర్ గూగుల్ మ్యాప్ను నమ్ముకోగా కుంటకట్టపైకి తీసుకెళ్లింది. ఈ ఘటన వడియారంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామ శివారులోని మహావీర్ పేపర్ పరిశ్రమకు వైజాగ్ నుండి డీసీఎం లోడ్ వచ్చింది. ఆదివారం సాయంత్రం డీసీఎం వడియారం శివారులోకి చేరుకోగా డ్రైవర్ గూగుల్మ్యాపు నమ్ముకొని ముందుకు సాగాడు. అంతే రైల్వే ట్రాక్ సమీపంలోని కుంటకట్ట వరకు వెళ్లి ఆగిపోయింది. సోమవారం ఉదయం స్థానికుల సాయంతో జేసీబీ తెప్పించి డీసీఎంను బయటకు తీయించి పరిశ్రమకు దారి చూపించారు.
చర్యలు తీసుకోవాలి
సిద్దిపేటకమాన్: వాట్సాప్ గ్రూప్లో భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ బీఆర్ గవాయ్ ఫొటోను జతపరుస్తూ అతడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరు న్యాయవాదులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ న్యాయవాదులు తెలిపారు. ఈ విషయంపై పోలీసు కమిషనర్ కార్యాలయంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలపై విచారణ జరిపి బీఎన్ఎస్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన న్యాయమూర్తి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ పేర్కొన్నారు.రవిబాబు, బాబురావు పాల్గొన్నారు.
ఆర్ఎంపీ క్లినిక్ సీజ్
నారాయణఖేడ్: ఇంజక్షన్ వికటించి బాలుడు మృతికి కారణమైన ఆర్ఎంపీ క్లినిక్ను జిల్లా వైద్యాధికారి సంధ్యారాణి సోమవారం సీజ్ చేశారు. వివరాలు ఇలా... మనూరు మండలం శెల్గిర గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు యూనుస్ చేసిన వైద్యం వికటించడంతో మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన ప్రశాంత్ (14) మృతి చెందాడు. ఈ ఘటనపై డీఎంహెచ్ఓ గ్రామంలో విచారణ నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా క్లినిక్ నడుపుతున్నట్లు గుర్తించారు. అనుమతులు లేకుండా క్లినిక్ను నిర్వహించడం, తమ స్థాయిని మించి వైద్యం చేయడం నేరమని ఆమె తెలిపారు.

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత