
యాజమాన్య నిర్లక్ష్యంతోనే ప్రమాదం
పటాన్చెరు టౌన్: యాజమాన్యం నిర్లక్ష్యం..ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు తూతూ మంత్రంగా చేపట్టే తనిఖీల మూలంగానే సిగాచి ఫార్మా పరిశ్రమలో పేలుడు ఘటన చోటుచేసుకుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన ప్రతీ కార్మికుడి కుటుంబానికి రూ.కోటి, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, క్షతగాత్రలకు మెరుగైన వైద్యంతోపాటు రూ.50లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పటాన్చెరు నియోజకవర్గ పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో సోమవారం ఉదయం రియాక్టర్ పేలుడు జరిగిన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనాస్థలికి ఎమ్మెల్యే గూడెం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా డీఐజి ఇక్బాల్, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్తో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... 30 ఏళ్లుగా పరిశ్రమ నడిపిస్తున్న సిగాచి యాజమాన్యం ఎన్నడూ కార్మికుల భద్రత కోసం చర్యలు తీసుకోలేదన్నారు. గతంలో కూడా ఇదే పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి పెద్ద సంఖ్యలో మృతి చెందారని గుర్తు చేశారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన పరిశ్రమల తనిఖీల విభాగం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికుల భద్రతను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించి..ఘటనకు కారకులైన యాజమాన్యం, నిర్లక్ష్యం వహించిన పరిశ్రమ విభాగం అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మృతుల కుటుంబాలకు రూ.కోటి, క్షతగాత్రులకు రూ. 50 లక్షలపరిహారం ఇవ్వాలి
ఒకరికి ఉద్యోగం కల్పించాలి
అధికారులతో కలిసి ఘటన స్థలాన్ని
పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం