
మురికిపాలిటీలు!
● పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం ● పేరుకుపోతున్న చెత్తాచెదారం ● వ్యాధులు ప్రబలే ప్రమాదం
మొక్కుబడిగా వంద రోజుల ప్రణాళిక
ఉమ్మడి జిల్లాలో మౌలిక వసతుల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జూన్ 2నుంచి ప్రారంభించిన 100 రోజుల ప్రణాళిక తూతూ మంత్రంగా కొనసాగుతోంది. చెత్త సేకరణ, పారిశుద్ధ్యంపై అవగాహన కరువైంది. అధికారులు నామమాత్రంగా కార్యక్రమాలు చేపట్టి చేతులు దులుపుకోవడంతో చెత్త పేరుకుపోయింది. ఆయా మున్సిపాలిటీల పరిధిలో మురుగు నీరు నిలిచి కుంటలను తలపిస్తున్నాయి.
అమలు కాని ప్రణాళిక
గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వంద రోజుల ప్రణాళిక సక్రమంగా అమలు కావడం లేదు. గజ్వేల్తోపాటు ప్రజ్ఞాపూర్, సంగుపల్లి, రాజిరెడ్డిపల్లి, సంగాపూర్, ముట్రాజ్పల్లి, క్యాసారం గ్రామాలు, ఆర్అండ్ఆర్ కాలనీ కూడా భౌగోళికంగా మున్సిపాలిటీ పరిధిలో ఉంది. ఇక్కడ వంద రోజుల ప్రణాళిక మచ్చుకై నా కనిపించడం లేదు. అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. మున్సిపాలిటీలో నిత్యం 20 టన్నులకుపైనే చెత్త ఉత్పత్తి అవుతున్నది. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేక.. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాల్లో చెత్త దర్శనమిస్తోంది. ఈ పరిస్థితి వ్యాధుల వ్యాప్తికి కారణమవుతోంది.
ఎక్కడ చూసినా మురికి కూపం
సంగారెడ్డి: మున్సిపాలిటీలో పారిశుధ్య పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వార్డులకు సరిపడా వాహనాలను సిబ్బందికి అందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. పనులన్నీ ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో కొనసాగుతుండటంతో అర్థం గాని పరిస్థితి నెలకొంది. దీంతో పట్టణంలో ఎక్కడ వేసిన చెత్త అక్కడే దర్శనమిస్తూ చెత్తకుప్పలను కాలుస్తున్నారు. తీవ్ర కాలుష్యం ఏర్పడుతుందని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
అరకొర పనులే..
పటాన్చెరు: అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. వర్షాకాలంలో పొంగి పొర్లుతున్నాయి సమస్య పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రధాన లైన్లలో సిల్టును తొలగించారు. ప్రజలకు తడి,పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించారు. ట్రేడ్ లైసెన్స్ జారీ ఇతర ప్రధాన అంశాలను నిర్వహించలేకపోతున్నారు. పట్టణ విస్తీర్ణం ఎక్కువగా ఉండటం, సిబ్బంది కొరతతో సమస్యలు సమర్థవంతంగా పరిష్కరించ లేకపోతున్నారు.
మురుగు పరుగు
సిద్దిపేటజోన్: సిద్దిపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వర్షాకాలం కావడంతో మురుగుకాల్వల పర్యవేక్షణ లోపభూయిష్టంగా మారింది. కొద్దిపాటి వర్షానికి వరద నీరు రోడ్లపైకి రావడంతో జలమయమవుతున్నాయి. దోమలతో పాటు కుక్కల బెడద అధికంగా ఉంది. అధికారులు యానిమల్ బర్త్ కంట్రోల్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వీధి విక్రయ జోన్ పటిష్టంగా అమలు కావడం లేదు. వెరసి సమస్యలతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
దుర్వాసన భరించలేకపోతున్నం
జిన్నారం (పటాన్చెరు): బొల్లారం మున్సిపాలిటీలో పారిశుధ్యంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 11వ వార్డు బీరప్ప బస్తీలో చెత్తకుప్పలు ఎక్కడికక్కడ దర్శనమిస్తున్నాయి. అధికారులు మాత్రం ప్రణాళిక హట్టహాసంగా సాగుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని అసహనానికి గురవుతున్నారు. సేకరించిన చెత్తను నివాసాల మధ్య వాహనాల్లో నింపి వదిలేయడంతో దుర్వాసన వస్తోందని చెబుతున్నారు. రాబోయే వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు శుభ్రత పనులు చేపట్టాలని కోరుతున్నారు.
అమలు అంతంత మాత్రమే!
జహీరాబాద్ టౌన్: మున్సిపాలిటీలో ప్రణాళిక పూర్తిగా పట్టాలెక్కలేదు. పట్టణంలోని గడి ప్రాంతం నుంచి వెళ్తున్న పెద్ద వాగు కాలువల్లోని చెత్తను జేసీబీలతో తొలగిస్తున్నారు. ముఖ్యంగా పిచ్చి మొక్కల తొలగింపు, పారిశుధ్యం, ట్యాంకుల శుభ్రతపై శ్రద్ధ వహిస్తున్నారు. దోమల నివారణకు ఫాగింగ్ను విస్మరించారు. మెప్మా ఉద్యోగులు నూతన పొదుపు సంఘాలు ఏర్పాటు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలు, మొక్కలు నాటడం ప్రారంభం కాలేదు. పనులు తూతూ మంత్రంగా చేస్తున్నారు.
సదాశివపేటలో అధ్వానం
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): పట్టణంలోని 26 వార్డులలో రోడ్ల ప్రక్కన చెత్తాచెదారం దర్శనమిస్తోంది. సిద్ధాపూర్ ప్రధాన రోడ్డు ప్రక్కన కుళ్లిన కూరగాయలు, మాంసపు వ్యర్థాలు పడేయడంతో దుర్గంధంతో ప్రజలు, వాహనదారులు ముక్కుమూసుకొని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. పట్టణంలోని మురుగు నీరు కాలువల ద్వారా ఊబ చెరువులో కలుస్తుండటంతో చెరువు కలుషితమవుతోంది. పట్టణంలోని ప్రధాన డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడంతో మురుగునీరు దుర్వాసన వెదజల్లుతోంది. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.

మురికిపాలిటీలు!

మురికిపాలిటీలు!

మురికిపాలిటీలు!

మురికిపాలిటీలు!

మురికిపాలిటీలు!

మురికిపాలిటీలు!